Army Jawan: సిద్దిపేట జిల్లాలో జవాన్ భూమి కబ్జా ! సీఎంకు జవాన్ విజ్ఞప్తి !
సిద్దిపేట జిల్లాలో జవాన్ భూమి కబ్జా ! సీఎంకు జవాన్ విజ్ఞప్తి !
సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలంలో ఆర్మీ జవాన్ భూమి కబ్జా తీవ్ర కలకలం రేపుతోంది. తన భూమిని కబ్జా నుంచి కాపాడాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జవాన్ సోషల్ మీడియాలో వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. దేశ సరిహద్దుల్లో తాను పోరాడుతుంటే తమ భూమిని కబ్జా చేశారంటూ అక్బర్పేట మండలం చౌదర్పల్లికి చెందిన రామస్వామి అనే ఆర్మీ జవాన్ సెల్పీ వీడియోను విడుదల చేశారు. తమ భూమిని కబ్జాదారుల చెర నుంచి విడిపించి తమకు ఇప్పించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి సదరు జవాన్ వీడియోలో విన్నవించారు. ప్రస్తుతం ఈ వీడియో రాష్ట్రవ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది.
అసలు ఆ వీడియోలో ఏముందంటే ?
దేశం సరిహద్దుల్లో తాను పోరాడుతుంటే తన సొంత గ్రామంలో తన భూమిని కొంత మంది కబ్జా చేశారని జవాన్ రామస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. భూమి విషయంలో నిలదీస్తున్న తన తల్లిదండ్రులు, కుటుంబాన్నీ కబ్జాదారులు బెదిరిస్తున్నారని తెలిపారు. తమ భూమిని కబ్జా చేసిన వ్యక్తి సోదరుడు వీఆర్వో కావడంతో అధికారులంతా వారికే మద్దతు తెలుపుతున్నారని జవాన్ ఆరోపించారు. స్థానిక ఎమ్మార్వో సైతం కబ్జాదారుడి తరఫునే మాట్లాడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆవేదన చెందారు. తన భూమిని తనకు ఇప్పించాలంటూ ఆర్డీవో, జిల్లా అధికారులు, కలెక్టర్ను కలిసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఎలాగైన తమ భూమిని తిరిగి ఇప్పించాలని వీడియో ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి జవాన్ విజ్ఞప్తి చేశారు.
తన సోదరుడికి చెందిన ఎకరం పొలాన్ని చుక్కా రమేష్ అనే వ్యక్తి తన అన్నదమ్ముల పేరు మీద మార్పు చేయించుకున్నాడని జవాన్ రామస్వామి సోదరుడు ఆరోపించారు. దీనిపై తమకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ను వీరు కోరుతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తమ భూమిపై తమకే హక్కులు కల్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై జిల్లా మాజీ మంత్రి హరీష్ రావు స్పందించి… వెంటనే కలెక్టర్తో మాట్లాడారు. ఆర్మీ జవాన్ కు సంబంధించిన భూమిపై విచారణ జరిపి అతడికి ఇప్పించాలని మాజీ మంత్రి చెప్పినట్లు తెలుస్తోంది.
