Bhoomi Chauhan: భూమి చౌహాన్ ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ జాం
భూమి చౌహాన్ ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ జాం
Bhoomi Chauhan : అహ్మదాబాద్ విమాన ప్రమాదం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. అహ్మదాబాద్ (Ahmedabad) నుంచి లండన్ కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలడంతో ఏకంగా 274 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఈ ఘటనలో విశ్వాస్ కుమార్ అనే ఒక ప్రయాణికుడు మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ప్రమాదం నుంచి మరో యువతి కూడా బయటపడ్డారు.
Bhoomi Chauhan Escapes
అయితే ఆమె ఈ ప్రమాదం నుండి బయటపడటానికి కేవలం ట్రాఫిక్ జాం కారణంగా తెలుస్తోంది. సాధారణంగా ట్రాఫిక్ జాం కారణంగా ఫ్లైట్ మిస్ అయితే ఎవరైనా సరే చాలా బాధపడతారు… దీనికి కారణం వేల రూపాయలు పెట్టి కొన్న టిక్కెట్టుకు నయా పైసా కూడా రిఫండ్ రాదు. దీనికి తోడు వారి టూర్ ప్లాన్ అంతా మారిపోవడం. కాని ట్రాఫిక్ జాం వలన ఫ్లైట్ మిస్ అయిన ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది.
ఆలస్యం అమృతం విషం… అని పెద్దలు అంటుంటారు. ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయాలి… ఆలస్యం చేయొద్దని సూచిస్తుంటారు. అయితే భూమి చౌహాన్ (Bhoomi Chauhan) అనే యువతి విషయంలో కొన్నిసార్లు లేట్ అవడం కూడా మంచిదేనని ఒప్పుకోక మానరు. లండన్ లో ఉండే భూమి చౌహాన్ అనే మహిళ రెండేళ్ల తర్వాత ఈ మధ్యే భారత్ కు వచ్చింది. కొన్నాళ్ల తర్వాత తిరుగు ప్రయాణం కోసం ఆమె ఏర్పాట్లు చేసుకుంది. అందులో భాగంగా జూన్ 12వ తేదీ (గురువారం) నాడు లండన్కు వెళ్తున్న ఎయిరిండియా ఏఐ-171కి టికెట్ బుక్ చేసుకుంది.
అయితే విమానాన్ని ఆమె కొద్దిలో మిస్ అయింది. భూమి చౌహాన్ (Bhoomi Chauhan) ఎయిర్పోర్ట్ కు చేరుకునేలోపు విమానం అక్కడి నుంచి వెళ్లిపోయింది. ట్రాఫిక్ జాంలో ఇరుక్కొని… ఎయిర్ పోర్ట్ కు చేరడం 10 నిమిషాలు ఆలస్యం కావడంతో ఫ్లైట్ మిస్ అయింది భూమి. దీనితో ఆమె ఎయిర్ పోర్ట్ లాంజ్ లో కూర్చుని చాలా బాధపడింది. మరల టిక్కెట్టు తీసుకెళ్లి ఎలా వెళ్ళాలిరా దేవుడా అంటూ నిరాశగా కూర్చుంది. అయితే ఆమె మిస్సైన ఫ్లైట్ టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఘోర ప్రమాదానికి గురై… సుమారు 274 మంది ప్రాణాలు బలితీసుకుంది.
దీనితో ఈ విషయం తెలిసి భూమి (Bhoomi Chauhan) ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనైంది. విమాన ప్రమాదం వార్త విని ఆమెకు బాధ అనిపించినప్పటికీ… అందులో తాను లేకుండా భగవంతుడే కాపాడాడని తెలిసి ఆనందం వ్యక్తం చేస్తుంది. ఈ సందర్భంగా భూమి చౌహాన్ మాట్లాడుతూ… ‘దేవుడికి కృతజతలు. ఆ గణపతి బప్పానే నన్ను కాపాడాడు. విమాన ప్రమాద ఘటనను తలచుకుంటే భయమేస్తోంది. నా శరీరం ఇంకా వణుకుతోంది. నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నా. ప్రమాదం గురించి తెలిసి నా మెదడు స్తంభించింది. 10 నిమిషాలు ఆలస్యం కావడంతో ఫ్లైట్ మిస్ అయ్యా. దయచేసి బోర్డింగ్ కు అనుమతించాలని వేడుకున్నా. కానీ అధికారులు నన్ను రానివ్వలేదు. దీంతో మధ్యాహ్నం 1.30 గంటలకు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లిపోయా. 1.38 గంటలకు విమానం ప్రమాదానికి గురైంది. ఆ దేవుడే నన్ను కాపాడాడు’ అని చెబుతూ భూమి భావోద్వేగానికి లోనైంది.
ఈ సందర్భంగా భూమి తల్లి మాట్లాడుతూ… ఈ విమాన ప్రమాదం నుంచి తన కూతురు తప్పించుకున్నందుకు నిజంగా ఆ దేవీ మాతకు ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా తక్కువేనన్నారు. ‘ నా కూతురు తన బిడ్డను నా వద్ద వదిలి లండన్కు బయల్దేరింది. నిజంగా ఆమె ఒంటరిగా విమానం ఎక్కి ఉంటే ఆమె కూతురు అనాథ అయ్యేది. తన కూతురు సేఫ్గా ఇంటికొచ్చిందని, ఆ విమాన ప్రమాం తలుచుకుంటేనే భయంగా ఉంది. నా కూతుర్ని ఆ దేవతే కాపాడింది’ అని పేర్కొన్నారు.
Also Read : Israel: ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ ఫోన్