Bihar Assembly Polls: మూడు విడతల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు
మూడు విడతల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు
Bihar : బిహార్ అసెంబ్లీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించే ఆలోచనలో ఎన్నికల కమిషన్ ఉన్నట్టు సమాచారం. ఈనెల 28న ఛట్పూజ ముగిసిన అనంతరం ఎన్నికలు నిర్వహించనుందని, నవంబర్ 5 నుంచి 15వ తేదీ వరకూ మూడు విడతల్లో ఎన్నికలు జరుగవచ్చని కథనాలు వెలువడుతున్నాయి. బిహార్ (Bihar) ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ గడువుకు ముందే ఎన్నికల ప్రక్రియ ఈసీ పూర్తి చేయాల్సి ఉంది. ఎన్నికల సన్నాహకాలు, తుది ఓటర్ల జాబితాపై సమీక్ష కోసం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వచ్చే వారంలో బిహార్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 30న ఓటర్ల తుది జాబితాను ఈసీ ప్రచురించనుంది.
Bihar Assembly Polls Update
కాగా, ఎన్నికల కమిషన్ ఇటీవలే పూర్తి చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై బిహార్లో రాజకీయ వేడి రగిలింది. రివిజన్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుంచి 65 లక్షల మంది ఓటర్లను ఈసీ తొలగించింది. నిజమైన ఓటర్లను తొలగించేందుకే ఈసీ ఈ చర్య చేపట్టిందని విపక్ష ‘ఇండియా’ కూటమి తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30న ప్రచురితమయ్యే తుది ఓటర్ల జాబితాలో ఎలాంటి అక్రమాలు జరిగినట్టు గుర్తించినా మొత్తం ప్రక్రియనే రద్దు చేస్తామని సుప్రీంకోర్టు గత వారంలో హెచ్చరించింది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు మూడు విడతల్లో జరగడం కొత్త కాదు. 2020లోనూ మూడు విడతలుగా పోలింగ్ నిర్వహించారు. అక్టోబర్ 28న 71 సీట్లకు పోలింగ్ జరుగగా, నవంబర్ 3న 94 నియోజకవర్గాల్లోనూ, నవంబర్ 7న 78 నియోజకవర్గాల్లోనూ పోలింగ్ జరిగింది. నవంబర్ 10న ఫలితాలు ప్రకటించారు. 2015లో ఐదు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఈఏడాది కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ఎన్డీయే, ‘ఇండియా’ కూటముల మధ్యే ఉంది. ఎన్డీయేలో బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (రామ్విలాస్) భాగస్వాములుగా ఉన్నాయి. విపక్ష కూటమిలో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్, వామపక్షాలు ఉన్నాయి.
Also Read : CM Chandrababu: సాంకేతికతతోనే ప్రజలకు పాలన మరింత చేరువ – సీఎం చంద్రబాబు
