Bilawal Bhutto: పాకిస్తాన్ మాజీ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టోపై ఉగ్రవాదుల ఆగ్రహం
పాకిస్తాన్ మాజీ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టోపై ఉగ్రవాదుల ఆగ్రహం
Bilawal Bhutto : భారత్, పాకిస్తాన్ మధ్య నమ్మకాన్ని చూరగొనే ప్రక్రియలో భాగంగా ఉగ్రవాదులు హఫీజ్ సయ్యద్, మసూద్ అజహర్లను భారత్కు అప్పగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ మాజీ విదేశాంగమంత్రి, పీపీపీ నాయకుడు బిలావల్ భుట్టో వ్యాఖ్యలు ఇప్పుడు ఆ దేశంలో కలకలం రేపుతున్నాయి. భారత్ కోరిన ఉగ్రవాదులను అప్పగించేందుకు అభ్యంతరం లేదంటూ బిలావల్ భుట్టో (Bilawal Bhutto) ఇటీవల చేసిన ప్రకటనపై పాక్ ఉగ్రవాదులు మండిపడుతున్నారు. ఈ విషయమై మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ తనయుడు తల్హా సయీద్ మాట్లాడుతూ బిలావల్ పాక్ కు తలవంపులు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిలావల్ ఇలాంటి కామెంట్ చేసి ఉండాల్సింది కాదని తల్హా సయీద్ అభిప్రాయపడ్డాడు. హఫీజ్ను భారత్కు అప్పగించేందుకు సిద్ధమేనని అనడం పాక్కు తలవంపులు తెచ్చిందని వ్యాఖ్యానించాడు. ఈ ప్రయత్నాలను గట్టిగా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశాడు. తల్హా సయీద్పై కూడా గ్లోబల్ టెర్రరిస్టు ముద్ర ఉంది.
Bilawal Bhutto Comments
అల్ జజీరా ఛానల్ కు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో బిలావల్ భుట్టో (Bilawal Bhutto) మాట్లాడుతూ… భారత్, పాక్ల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందించే చర్యలపై స్పందించారు. భారత్ కోరిన వారిని అప్పగించేందుకు సిద్ధమేనని, ఇందుకు భారత్కు కూడా సహకరించాలని కోరారు. లష్కరే తోయిబా (ఎల్ఇటి) మరియు జైషే మొహమ్మద్ (జెఎం) చీఫ్ మసూద్ అజార్ను అప్పగించడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ లో ఉగ్రవాదమే తీవ్ర అంశంగా మారిన సమయంలో భారత్తో నమ్మకాన్ని చూరగొనడానికి ఇదొక మార్గమన్నారు. ఈ విషయంలో పాకిస్తాన్ ఎటువంటి అభ్యంతరం చెప్పదని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావాల్ స్పష్టం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలు భారత్లో నిర్వహించారని ఆరోపణలు నేపథ్యంలో వారిని అప్పగిస్తామని, అందుకు సంబంధించిన న్యాయప్రక్రియకు భారత్ సహకరించాలన్నారు.
ఎల్ఈటీతో పాటు జైషే మహ్మద్ ఉగ్ర సంస్థను పాక్ నిషేధించిన విషయం తెలిసిందే. ముంబై 26/11 దాడుల సూత్రధారి అయిన హఫీజ్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో అతడికి 33 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇక 2001 నాటి పార్లమెంటుపై దాడి మొదలు భారత్ లో జరిగిన అనేక ఉగ్ర ఘటనల వెనకాల మసూద్ అజర్ పాత్ర ఉంది. అయితే, ఈ ఇద్దరు పాక్లో పూర్తి స్వేచ్ఛతో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని భారత్ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఎల్ఈటీ చీఫ్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడని చెప్పిన భుట్టో… మసూద్ అజర్ మాత్రం అఫ్గానిస్థాన్లో ఉండి ఉండొచ్చని అన్నారు.
Also Read : CM Siddaramaiah: ‘వ్యాక్సిన్’ ఆరోపణలపై సిద్ధరామయ్య క్షమాపణ చెప్పాలి – బీజేపీ
