Black Box: ఘటనా స్థలంలో దొరికిన బ్లాక్ బాక్స్ ! విమాన ప్రమాదం గుట్టు విప్పేనా ?
ఘటనా స్థలంలో దొరికిన బ్లాక్ బాక్స్ ! విమాన ప్రమాదం గుట్టు విప్పేనా ?
Black Box : అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ లభ్యమైంది. విమానం ఢీకొట్టిన మెడికల్ కాలేజీ పీజీ హాస్టల్ పైకప్పు భవన శిథిలాల నుంచి ఈ బ్లాక్ బాక్స్ (Black Box) స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వెల్లడించింది. ప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 40 మంది సిబ్బంది పౌరవిమానయాన శాఖ బృందాలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది.
అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిరిండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇప్పటివరకు తెలియలేదు. విమానంలో కీలకంగా ఉండే బ్లాక్ బాక్స్లోని (Black Box) సమాచారాన్ని విశ్లేషిస్తే ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునే వీలు కలుగుతుంది.
Black Box – ఏమిటీ బ్లాక్ బాక్స్ ?
ప్రతి కమర్షియల్ విమానంలో రెండు బాక్స్లు ఉంటాయి. అందులో ఒకటి ఫ్లైట్ డేటాను రికార్డ్ చేయగా… మరొకటి కాక్పిట్ వాయిస్ రికార్డుకు ఉపయోగపడుతుంది. విమానాలకు ఏదైనా ముప్పు వాటిల్లినప్పుడు, అత్యవసర పరిస్థితిని తెలియజేస్తూ ‘మేడే’ అంటూ సమీపంలోని ఏటీసీకి పైలట్ ఓ సందేశాన్ని పంపుతారు. వీటితోపాటు పైలట్-కోపైలట్ల సంభాషణలన్నీ డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (డీఎఫ్డీఆర్)లో రికార్డవుతాయి. ఈ డీఎఫ్డీఆర్నే బ్లాక్బాక్స్గా వ్యవహరిస్తారని ఏఏఐబీ తెలిపింది. పేరుకే బ్లాక్ బాక్స్ కానీ మెరిసే ఆరంజ్ కలర్లో ఈ బాక్స్ ఉంటుంది. శిథిలాల్లోనూ, నీటిలోనూ సులభంగా దీన్ని గుర్తించే వీలుంటుంది.
విమానం వేగం, ఎంత ఎత్తులో ఎగురుతోంది, ఇంజన్ పనితీరు, కాక్పిట్ అడియా వంటి కీలక సమాచారం ఈ బ్లాక్బాక్స్లో (Black Box) ఉంటుంది. పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య సంభాషణలు రికార్డవుతాయి. ఎలాంటి విపత్తులు ఎదురైనా డేటా చెక్కుచెదరకుండా ఉండేలా బ్లాక్ బ్సాక్ను రూపొందిస్తారు. తీవ్ర ఉష్ణోగ్రతను, నీటిలో పడినా తట్టుకుని ఇది నిలబడుతుంది. స్టీల్, టైటానియం వంటి మెటీరియల్తో రూపొందిస్తారు.
విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిరిండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు
అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని బోయింగ్ 787 విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని ఎయిరిండియాను ఆదేశించింది. ఈ మేరకు తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని పేర్కొంది.
‘‘అహ్మదాబాద్-గాట్విక్ ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన దృష్ట్యా… బోయింగ్ 787-8/9కు చెందిన విమానాల్లో మెరుగైన భద్రతా తనిఖీలు చేయాలి. సంబంధిత ప్రాంతీయ డీజీసీఏ కార్యాలయాల సహకారంతో తక్షణమే వీటిని చేపట్టాలి’’ అని ఎయిరిండియాను డీజీసీఏ ఆదేశించింది. విమానాలు బయలుదేరే ముందు ఇంధనం పర్యవేక్షణ, క్యాబిన్ ఎయిర్ కంప్రెసర్, ఎలక్ట్రానిక్ ఇంజిన్ నియంత్రణ వ్యవస్థ, హైడ్రాలిక్ వ్యవస్థ, టేకాఫ్ ప్రమాణాల పున:పరిశీలన వంటి తనిఖీలు తప్పనిసరిగా చేపట్టాలని స్పష్టం చేసింది.
వీటితోపాటు ఫ్లైట్ కంట్రోల్ ఇన్స్పెక్షన్ను ప్రవేశపెడుతున్నామని, ఇంజిన్ సామర్థ్యాలకు సంబంధించిన తనిఖీలను రెండు వారాల్లో పూర్తిచేయాలని ఎయిరిండియాకు సూచించింది. బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాల్లో గత పదిహేను రోజుల్లో తరచుగా సంభవించిన సమస్యలను వీలైనంత త్వరగా సమీక్షించుకోవాలని సూచించింది. సమీక్ష తర్వాత నిర్వహణ చర్యలను ముగించాలని తాజా ఆదేశాల్లో పేర్కొంది. సంబంధిత తనిఖీల నివేదికను డీజీసీఏకు అందజేయాలని సూచించింది.
Also Read : Vijay Rupani: మాజీ సీఎం విజయ్ రూపాణీ కుటుంబసభ్యులకు ప్రధాని మోదీ పరామర్శ