Bridge Collapses: పూణెలో ఘోర ప్రమాదం ! ఇంద్రాయణి నదిపై వంతెన కూలి అనేక మంది గల్లంతు !
పూణెలో ఘోర ప్రమాదం ! ఇంద్రాయణి నదిపై వంతెన కూలి అనేక మంది గల్లంతు !
మహరాష్ట్రలోని పూణెలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో అనేక మంది పర్యటకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా ఆరుగురిని స్థానికులు రక్షించినట్లు సమాచారం. మిగతావారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
పుణె జిల్లాలోని మావళ్ తాలూకాలోని తలెగావ్ దాభాడే వద్ద విషాదం చోటు చేసుకుంది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం కుండమళా వద్ద ఆదివారం మధ్యాహ్నం 3.30గంటల సమయంలో ఇంద్రాయణి నదిపై ఉన్న పాత బ్రిడ్జ్ ఆకస్మాత్తుగా కూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పదుల సంఖ్యలో పర్యాటకులు బ్రిడ్జి కింద ప్రవహిస్తున్న ఇంద్రాయణి నదిలో గల్లంతయ్యినట్లు తెలుస్తోంది. వీకెండ్ కావడంతో ఇంద్రాయణి నది పర్యాటక ప్రాంతం కావడంతో వీక్షించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి వచ్చారు. అయితే, రెండు రోజులు పాటు భారీగా కురిసిన వర్షాలకు పురాతన బ్రిడ్జి నానింది. పర్యాటకులు ఆ బ్రిడ్జిపైకి రావడంతో ఒక్కసారిగా అది కుప్పకూలింది. దీనితో బ్రిడ్జి కింద ప్రవహిస్తున్న ఇంద్రాయణి నదిలో పర్యాటకులు జారి పడి గల్లంతయ్యారు.
ప్రమాదంపై సమాచారం అందుకు ఎన్డీఆర్ఫ్ బృందాలు బాధితుల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. ఆరుగురు పర్యాటకుల్ని రక్షించారు. ఈ దుర్ఘటనతో పింప్రి-చించ్వడ్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని తలెగావ్ దాభాడే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అధికార యంత్రాంగం, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
ఇంద్రాయణి నదిపై ఈ ఇనుప వంతెనను 30 ఏళ్ల క్రితం నిర్మించినట్లు స్థానిక ఎమ్మెల్యే వెల్లడించారు. ఇది కేవలం కాలినడక మార్గమే. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 100 మంది ఉన్నారని, అందులో అనేక మంది ఒడ్డుకు చేరుకున్నప్పటికీ పలువురు గల్లంతయ్యారని చెప్పారు. ఇదిలాఉంటే, మహారాష్ట్రలో అనేక ప్రాంతాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుణెతోపాటు, పింప్రీ చించ్వాడ్ ప్రాంతాలకు వాతావరణశాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
గత నాలుగు రోజులుగా పూణే ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. అందువల్ల ఇంద్రాయణి నది నీటి ప్రవాహం పెరిగింది. ఆదివారం కావడంతో ఆ ప్రదేశానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. దీంతో ఆ పాత వంతెన జనాల బరువు తట్టుకోలేక కూలిపోయిందని అధికారులు ప్రాథమికంగా చెబుతున్నారు. మరోవైపు పర్యాటకుల భద్రత కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. కుండమల ఒక పర్యాటక ప్రదేశం. ఈ ప్రాంతం ప్రమాదకరమని చెబుతారు. కానీ వర్షాకాలంలో ముఖ్యంగా శని, ఆదివారాల్లో ఈ ప్రదేశం పర్యాటకులతో బిజీగా మారిపోతుంది.
ఇంద్రాయణి నది ఘటనపై సీఎం సీరియస్
ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన కూలిన ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రకటించారు. అదేసమయంలో వంతెన కూలిపోవడానికి గల కారణాలను లోతుగా విచారించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన రాష్ట్రంలోని పాత వంతెనల భద్రత, నిర్మాణ నాణ్యతపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది. ఈ దుర్ఘటన రాష్ట్రంలోని ఇతర వంతెనల పరిస్థితిని పరిశీలించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.