BSF Jawaan: బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ ను భారత్కు అప్పగించిన పాకిస్థాన్
బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ ను భారత్కు అప్పగించిన పాకిస్థాన్
BSF Jawaan : అనుకోకుండా భారత్ సరిహాద్దు దాటి పాకిస్థాన్ రేంజర్ల అదుపులో ఉన్న మన బీఎస్ఎఫ్ జవాన్ విడుదల విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. 21 రోజుల తర్వాత బీఎస్ఎఫ్ జవాన్(BSF Jawaan) పూర్ణం కుమార్ షాను బుధవారం భారత్ కు పాకిస్థాన్ అప్పగించింది. ఉదయం 10.30 గంటలకు మన జవాన్ ను అట్టారి-వాఘా సరిహద్దు వద్ద పాకిస్థాన్ రేంజర్లు బీఎస్ఎఫ్కు అప్పగించినట్టు బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. పాకిస్థాన్ రేంజర్లతో బీఎస్ఎఫ్ నిరంతరం నిర్వహించిన ఫ్లాగ్ సమావేశాలు, ఇతర కమ్యూనికేషన్ మార్గాల ద్వారా బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ను వెనక్కి తీసుకురావడం సాధ్యపడినట్టు చెప్పారు.
BSF Jawaan Return to India
ఇన్ని రోజులు బీఎస్ఎఫ్… పాక్ రేంజర్ల అదుపులో ఉన్న నేపథ్యంలో ఈయనకు పూర్తిస్థాయిలో బాడీ చెకప్ తోపాటు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. 24వ బీఎస్ఎఫ్(BSF) బెటాలియన్ కు చెందిన పూర్ణం కుమార్ ను పంజాబ్ లో భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ రేంజర్లు ఏప్రిల్ 23న అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఫెరోజ్పూర్ సెక్టార్ ప్రాంతంలో విధుల్లో ఉన్న షా అనుకోకుండా సరిహద్దు దాటడంతో పాకిస్థాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. బీఎస్ఎఫ్ జవాన్ను బుధవారం పాకిస్థాన్ అప్పగించిన వెంటనే దాదాపు రెండు వారాలుగా కస్టడీలో ఉన్న పాకిస్థాన్ రేంజర్ను భారత్ విడుదల చేసింది.
పంజాబ్ లోని ఫిరోజ్పుర్ సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి రైతులకు రక్షణగా గత నెల 23న గస్తీ నిర్వహిస్తున్న సమయంలో పూర్ణం అస్వస్థతకు గురయ్యారు. సమీపంలో ఓ చెట్టు కనబడటంతో దానికింద విశ్రాంతి తీసుకున్నారు. అది పాక్ భూభాగం అన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. పాకిస్థాన్ రేంజర్స్ ఆయనను నిర్బంధంలోకి తీసుకున్నారు. జవాన్ విడుదల కోసం రెండు దేశాల భద్రతా దళాలు ఆరు సార్లు చర్చలు జరిపాయి. మరోవైపు పూర్ణం కుటుంబసభ్యులు తీవ్రంగా ఆందోళన చెందారు. గర్భిణి అయిన ఆయన భార్య… భర్త విడుదల కోసం కేంద్రాన్ని వేడుకున్నారు. కొన్నాళ్లపాటు భారత్ అధికారుల అభ్యర్థనలు పట్టించుకోకుండా పాక్ రేంజర్లు కాలయాపన చేశారు. అయితే ఈ నెల మొదటివారంలో రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ సమీపంలో మన భూభాగంలోకి ప్రవేశించిన పాక్ రేంజర్ మహమ్మదుల్లాను బీఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుంది. దీంతో పాకిస్థాన్పైనా ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే పూర్ణంను విడుదల చేసింది. బీఎస్ఎఫ్ కూడా పాక్ రేంజర్ను అప్పగించింది. పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లాకు చెందిన సాహూ విడుదలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తంచేశారు.
Also Read : Shubhanshu Shukla: శుభాంశు శుక్లా రోదసి యాత్రకు ముహూర్తం ఫిక్స్ ! ఎప్పుడంటే ?