Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రలో అపశృతి ! రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు !

అమర్‌నాథ్ యాత్రలో అపశృతి ! రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు !

Amarnath Yatra : జమ్ముకశ్మీర్‌ లో జూలై మూడు నుంచి ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్రలో (Amarnath Yatra) తాజాగా స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. రాంబన్‌ లోని చందర్‌కోట్ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు గాయపడ్డారు. ఇక్కడి నుంచి పహల్గామ్‌నకు వెళ్లే రహదారిలో ఐదు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు గాయపడ్డారని అధికారులు తెలిపారు.

Amarnath Yatra Bus Accident

యాత్రా కాన్వాయ్‌లో ఈ బస్సులు బ్రేక్ ఫెయిల్ కావడంతో నియంత్రణ కోల్పోయి ఒకదానికొకటి ఢీకొన్నాయని అధికారులు వివరించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఆరోగ్య శాఖ రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన యాత్రికులను రాంబన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఏడాది జూలై 3న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 9 వరకు అంటే రక్షా బంధన్ వరకూ కొనసాగనుంది. సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర గుహకు యాత్రికులు రెండు మార్గాల ద్వారా చేరుకుంటారు. వాటిలో ఒకటి పహల్గామ్ మార్గం. రెండవది బాల్తాల్ మార్గం.

6,979 మంది యాత్రికుల బృందం శనివారం జమ్ము నుండి కాశ్మీర్‌ కు గట్టి భద్రత మధ్య అమర్‌నాథ్‌ యాత్రకు బయలుదేరింది. జూలై 3న ప్రారంభమైన ఈ యాత్ర 38 రోజులపాటు జరగనుంది. గడచిన రెండు రోజుల్లో 26,800 మందికి పైగా భక్తులు అమర్‌నాథ్‌ ను దర్శించుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కొత్త బ్యాచ్ భగవతి నగర్ యాత్ర నివాస్ నుండి 312 వాహనాలతో కూడిన రెండు ఎస్కార్ట్ కాన్వాయ్‌లలో బయలుదేరింది. ఈ యాత్రికులలో 2,753 మంది బాల్టాల్ బేస్ క్యాంప్‌కు వెళుతుండగా, 4,226 మంది నున్వాన్ (పహల్గామ్) బేస్ క్యాంప్‌కు బయలుదేరారు.

Also Read : China: చైనా బంపర్ ఆఫర్ ! మూడో బిడ్డను కంటే రూ.12 లక్షలు !

Leave A Reply

Your Email Id will not be published!