Cargo Ship: కేరళ సమీపంలో నౌకలో భారీ అగ్నిప్రమాదం ! నలుగురు గల్లంతు !
కేరళ సమీపంలో నౌకలో భారీ అగ్నిప్రమాదం ! నలుగురు గల్లంతు !
సింగపూర్ పతాకంతో ప్రయాణిస్తున్న ఓ కంటైనర్ నౌకలో కేరళ తీర సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మొత్తం 22 మంది సిబ్బందితో శ్రీలంక నుంచి ముంబైకి బయల్దేరిన ఎంవీ వాన్ హాయ్503 అనే కార్గో షిప్… కేరళ సమీప సముద్రజలాల్లోకి రాగానే పెద్ద పేలుడు సంభవించింది. ప్రమాదకర రసాయనాలతో ప్రయాణిస్తున్న ఎమ్వీ వాన్ హై 503 నౌక.. కేరళ తీర సమీపానికి రాగానే ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న కొచ్చిన్లోని నౌకాదళం అప్రమత్తమై అత్యవసర సహాయం కోసం ఐఎన్ఎస్ సూరత్ నౌకను తరలించింది. ఈ ప్రమాదంలో 18 మందిని ఇండియన్ కోస్ట్ గార్డ్స్ రక్షించగా… మరో నలుగురు గల్లంతయ్యారు. కేరళలోని కన్నూర్ జిల్లాలోని అఝిక్కల్ పట్టణ తీరం నుంచి 44 నాటికల్ మైళ్ల దూరంలో సోమవారం ఉదయం 9.20 గంటలకు ఈ దుర్ఘటన సంభవించినట్లు కోస్ట్ గార్డు అధికారులు తెలిపారు.
నౌకలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే భారత గస్తీ బలగాలు రంగంలోకి దిగి 18 మంది సిబ్బందిని కాపాడాయి. నౌకలో ఎనిమిది మంది చైనా, ఆరుగు తైవాన్, ఐదుగురు మయన్మార్, ముగ్గురు ఇండోనేసియాకు చెందిన సిబ్బంది ఉండగా వారిలో 18 మందిని రక్షించగాలిగారు. వీరిని ఐఎన్ఎస్ సూరత్ నౌకలో మంగళూరు పోర్ట్కు తీసుకొచ్చారు. షెడ్యూల్ ప్రకారం నౌక జూన్ 10వ తేదీకల్లా ముంబైలోని నవాషేవా ప్రాంతానికి చేరుకోవాల్సి ఉండగా మార్గమధ్యంలోనే ప్రమాదానికి గురైంది. దీనితో నౌకాదళ కేంద్రం ‘ఐఎన్ఎస్ గరుడ’ నుంచి పరిస్థితిని సమీక్షిస్తోంది. డోర్నియర్ విమానంతో ఆ ప్రదేశంలో గస్తీ నిర్వహిస్తోంది.గత 30 రోజుల్లో కేరళ సమీపంలో సరకు రవాణానౌక ప్రమాదానికి గురికావడం ఇది రెండోసారి. మే 24న లైబీరియా జెండాతో వెళ్తున్న కార్గో నౌక తీరానికి 14.6 మైళ్లదూరంలో మునిగిపోయింది.