Minister Adimulapu Suresh: మంత్రి ఆదిమూలపు సురేష్ ఎస్సీ కాదంటూ స్పందనలో ఫిర్యాదు !
మంత్రి ఆదిమూలపు సురేష్ ఎస్సీ కాదంటూ స్పందనలో ఫిర్యాదు !
Minister Adimulapu Suresh: ఏపి పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎస్సీ కాదంటూ… ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన పి ఇమ్మాన్యుయేల్, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు ఫిర్యాదు చేసారు. సోమవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఇమ్మాన్యుయేల్ తన అర్జీను కలెక్టర్ దినేష్ కుమార్ కు అందజేసారు. ‘మార్కాపురం మండలం గజ్జలకొండ గ్రామానికి చెందిన సురేష్ తల్లిదండ్రులు ఆదిమూలపు శ్యామ్యూల్ జార్జి, థెరీసమ్మ జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం బీసీ(సీ)లుగా… క్రిస్టియన్ కోటాలో 1984లో కర్నూలులోని శ్రీరాయలసీమ క్రిస్టియన్ మైనారిటీ కళాశాల ఏర్పాటుకు అనుమతి పొందారు.
మంత్రి సురేష్ తండ్రి జార్జి అప్పట్లో ప్రధానోపాధ్యాయుడు కావడంతో టీసీలో తన కుమారులను ఎస్సీలుగానే పేర్కొని ప్రభుత్వాన్ని మోసం చేశారు. కానీ ఆదిమూలపు సురేష్ బీసీ(సీ) కేటగిరీ కిందకు వస్తారని ఆ అర్జీలో ఆరోపించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి మంత్రి ఆదిమూలపు సురేష్ పై అనర్హత వేటు వేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనితో మంత్రి ఆదిమూలపు సురేష్ ఇరకాటంలో పడినట్లు తెలుస్తోంది.
గతంలో కూడా అరకు ఎంపీ కొత్తపల్లి గీత, మాజీ మంత్రులు శత్రుచర్ల విజయరామరాజు, పాముల పుష్పశ్రీవాణి, మాజీ కేంద్రమంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ వంటి పలువరు నాయకులు ఎస్టీ కాదంటూ కేసులు నమోదు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇందులో మాజీ మంత్రి శత్రుచర్ల విజరామరాజు ఎస్టీ కాదని కోర్టు తేల్చడంతో… ఎస్టీ కోటా క్రింద ప్రభుత్వం నుండి పొందిన ప్రయోజనాలను వెనక్కి ఇవ్వాలని కోర్టు ఆదేశించిన విషయం కూడా విదితమే. దీనితో ఇప్పుడు మంత్రి ఆదిమూలపు సురేష్ పై కేసు నమోదు కావడం వైసిపి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Minister Adimulapu Suresh – ఇప్పటికే ఆదాయానికి మించి అక్రమ ఆస్తుల కేసు ఎదుర్కొంటున్న మంత్రి
ప్రకాశం జిల్లా మార్కాపూర్ కు చెందిన ఆదిమూలపు సురేష్(Minister Adimulapu Suresh), అతని భార్య టి.హెచ్. విజయలక్ష్మీ ఇండియన్ రెవిన్యూ సర్వీసెస్ (ఐఆర్ఎస్) ఉద్యోగులుగా పనిచేసేవారు. అయితే రాజకీయాల పట్ల ఆశక్తితో ఆదిమూలపు సురేష్… 2009 ఎన్నికలకు ముందు తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం ఎర్రగొండపాలేం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందారు. అయితే అతని భార్య విజయలక్ష్మి మాత్రం ఐఆర్ఎస్ అధికారిగానే కొనసాగుతున్నారు. అనంతరం వైసిపిలో చేరిన సురేష్… 2014లో సంతనూతలపాడు నుండి రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో మరల ఎర్రగొండపాలేం నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందిన ఆదిమూలపు సురేష్ కు ముఖ్యమంత్రి జగన్ తన మొదటి కేబినెట్ లో విద్యాశాఖను కేటాయించగా… రెండో కేబినెట్ లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డవలెప్ మెంట్ శాఖను కేటాయించారు.
ఇది ఇలా ఉండగా 2016లో దేశ వ్యాప్తంగా ఐఆర్ఎస్ అధికారులపై సిబిఐ అధికారులు నిర్వహించిన సోదాల్లో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ సురేష్ తో పాటు అతని భార్య విజయలక్ష్మిపై కేసు నమోదు చేసారు. అయితే సిబిఐ అధికారులు ప్రాధమిక విచారణ జరపుకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేసారని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో సురేష్(Suresh) కు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే సిబిఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మరల ఆదిమూలపు సురేష్ దంపతులపై కేసు నమోదు చేసారు.
Also Read : MLA Rachamallu Siva Prasad Reddy: వైసిపి ఎమ్మెల్యే పోన్ హ్యాక్ ? ఎస్పీకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే !