Amarnath Yatra: సీసీటీవీ కెమెరాల నిఘా నేత్రంలో అమర్‌నాథ్‌ యాత్ర

సీసీటీవీ కెమెరాల నిఘా నేత్రంలో అమర్‌నాథ్‌ యాత్ర

 

మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న అమర్ నాథ్ యాత్రకోసం… కేంద్ర ప్రభుత్వంతో పాటు జమ్మూకశ్మీర్ యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. పహాల్గాం ఉగ్రదాడి అనంతరం… అటువంటి ఘటనలు జరగకుండా అమర్ నాథ్ యాత్ర మార్గంలో సీసీటీవీలను ఏర్పాటు చేస్తోంది. అంతేకాదు అనుమానితులను వెంటనే పట్టుకునేందుకు ఆ సీసీటీవీ కేమరాల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీను ఉపయోగించనున్నట్లు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఈ నేపథ్యంలో అమర్‌నాథ్‌ యాత్రికులకు ఉగ్రవాద ముప్పును తప్పించే చర్యల్లో భాగంగా పహల్గాం మార్గంలో వెళ్లే యాత్రికుల కోసం ముఖ గుర్తింపు వ్యవస్థ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) ఏర్పాటు చేసినట్టు జమ్మూకశ్మీర్‌ అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. నిఘా కెమెరాల దృష్టికి బ్లాక్‌ లిస్టులో ఉన్న వ్యక్తి ఎవరైనా వస్తే ఆ కెమెరాలు వెంటనే హెచ్చరికలు జారీ చేసే ఏర్పాటు జరిగిందని ఆ వర్గాలు తెలిపాయి. అమర్‌నాథ్‌ యాత్రలో భద్రతను కట్టుదిట్టం చేసే ప్రయత్నంలో భాగంగా క్రియాశీలంగా ఉన్న ఉగ్రవాదుల, అనుమానిత ఉగ్రవాద కార్యకర్తల చిత్రాలు ఎఫ్‌ఆర్‌ఎస్‌లో పొందుపరిచారు.‘‘బ్లాక్‌లిస్టులో వున్న వ్యక్తులెవరైనా కెమెరా నిఘా కంటికి కనబడిన వెంటనే పర్యవేక్షక కేంద్రంలో గట్టి శబ్దంతో సైరన్‌ వినిపిస్తుంది. అలా అప్రమత్తమైన భద్రతాదళాలు ముప్పును మట్టుబెట్టేందుకు తక్షణం కదులుతారు’’ అని ఆ వర్గాలు తెలిపాయి. ఎఫ్‌ఆర్‌ఎస్‌ తనలో పొందుపరచిన చిత్రాలు, వీడియోల ఆధారంగా ప్రమాదకర వ్యక్తుల్ని గుర్తించ గలుగుతుంది.

వచ్చే నెల 3న దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయ పర్వతాల్లో అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర ఆగస్టు 9న రక్షాబంధన దినోత్సవం రోజున ముగుస్తుంది. గతంలో ఈ యాత్ర మొత్తం 52 రోజుల పాటు సాగేది. దీన్ని 38 రోజులకు కుదించారు. గతంలోనూ ఉగ్రవాదులు అమర్‌నాథ్‌ యాత్రను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారు. అందుకే ఈసారి పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించాం’’ అని అధికారి ఒకరు తెలిపారు. యాత్ర సాగే మార్గం మొత్తంపై సీసీటీవీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు.

గతంలో మూడుసార్లు ఉగ్రదాడులు

 

జమ్మూకశ్మీర్‌లో 2000 సంవత్సరం ఆగస్టు నెలలో జరిగిన ఉగ్రదాడిలో 24 మంది అమర్‌నాథ్‌ యాత్రికులతో సహా మొత్తం 32 మంది మరణించారు. 2001 జులైలో జరిగిన మరో దాడిలో 13 మంది హతమయ్యారు. 2017లో కుల్గామ్‌ జిల్లాలో అమర్‌నాథ్‌ యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో 8 మంది మృతిచెందారు.

Leave A Reply

Your Email Id will not be published!