Census : జనగణనకు కేంద్రం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా 2026 ఏప్రిల్ 1 నుంచి ఇళ్ల లెక్కింపు ఆపరేషన్ నిర్వహించనున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇది 16వ జనాభా గణన (Census) అవుతుంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇది ఎనిమిదవది. ఇందుకు సంబంధించిన టైమ్లైన్, సన్నాహక లక్ష్యాలలో సహకారం కోరుతూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు జనాభా లెక్కల కమిషనర్, రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ ఆదివారంనాడు ఒక లేఖ రాశారు.
Census on 2026
జనాభా లెక్కింపు మొదటి దశ ప్రారంభానికి సూచికగా 2026 ఏప్రిల్ 1 నుంచి గృహాల గణన ఉంటుందని ఆ లేఖలో కుమార్ నారాయణ తెలిపారు. దీనికి ముందు పర్యవేక్షకులు, ఎన్యూమరేటర్ల నియామకం జరుగుతుందని, రాష్ట్రాలు, జిల్లా అడ్మినిస్ట్రేషన్ హకారంతో వీరికి పని విభజన జరుగుతుందని తెలిపారు. ఎన్యూమరేటర్లు, పర్యవేక్షలు, 1.3 లక్షల మంది జనాభా లెక్కల సేకరణ ఫంక్షనరీలు సహా 34 లక్షల మందికి పైగా సిబ్బంది దేశవ్యాప్తంగా జరిగే ఈ జనగణనలో పాలుపంచుకుంటారని చెప్పారు.
రెండు దశల్లో జనగణన
కాగా, జనాభా లెక్కింపు రెండు దశలుగా జరుగనుంది. మొదటి దశలో గృహాల జాబితా ఆపరేషన్ ఉంటుంది. ఇందులో భాగంగా ప్రతీ ఇంటి పరిస్థితి, ఆస్తులు, సౌకర్యాల వంటి వివరాలను సేకరిస్తారు. రెండో దశలో పాపులేషన్ ఎన్యూమరేషన్ కింద ప్రతి ఇంట్లోని జనాభా, వారి సామాజిక, ఆర్థిక పరిస్థితి వంటి వివరాలను సేకరిస్తారు. దీనికి అదనంగా, ప్రభుత్వం గతంలో ప్రకటించినట్టు జనాభా లెక్కల సేకరణలో భాగంగా కులగణన కూడా ఉంటుంది. కాగా, ఈసారి తొలిసారిగా డిజిటల్ ఫార్మెట్లో జనాభా గణనను నిర్వహించనున్నారు. స్వీయగణన కూడా ప్రజలకు అందుబాటులో ఉంచుతారు.
Also Read : DK Shivakumar: మరో మూడు నెలల్లో కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ?
