Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి
బెంగళూరు తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి
Bengaluru Stampede : 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు… ఐపీఎల్ లో తొలి టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ(RCB) జట్టుకు సన్మాన కార్యక్రమంలో పెను విషాదం చోటు చేసుకుంది. అభిమాన జట్టును చూడటానికి స్టేడియం వద్దకు వేలాదిగా తరలివచ్చిన అభిమానులు… స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేట్-2 నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు.
Bengaluru Stampede – Chandrababu Comments
దీనితో అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. దీనితో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, 70 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. తొక్కిసలాట ఘటనతో ఆర్సీబీ క్రీడాకారులకు సన్మాన కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. చిన్నస్వామి స్టేడియంవైపు వెళ్లే మెట్రో, ఇతర వాహనాలను నిలిపివేశారు.
దీనితో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా పోస్టులు పెట్టారు. ఈ ఘటన దురదృష్టకరం, హృదయ విదారకమని పేర్కొన్నారు.
‘‘బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. చాలా బాధకలిగించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
‘‘ఆర్సీబీ విజయోత్సవాల్లో జరిగిన విషాదం దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల్లో చిన్నారులు కూడా ఉండటం మరింత బాధాకరం. వేడుకల్లో ఇంత విషాదం జరగడం చాలా దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోస్ట్ చేసారు.
Also Read : Odisha Hospital: సూదిమందు వికటించి ఒడిశాలో ఆరుగురు మృతి