Chhattisgarh: వివాదంలో ఛత్తీస్గఢ్ డీఎస్పీ సతీమణి ! ప్రభుత్వ వాహనంపై భర్త్ డే పార్టీ !
వివాదంలో ఛత్తీస్గఢ్ డీఎస్పీ సతీమణి ! ప్రభుత్వ వాహనంపై భర్త్ డే పార్టీ !
ఆమె ఓ ప్రభుత్వ అధికారి భార్య. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన ఆ మహిళ… బాధ్యత మరిచిపోయి ఓవరాక్షన్ చేసింది. ఇప్పుడు తన భర్తతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులకు తలనొప్పి తెచ్చిపెట్టింది. తన పుట్టిన రోజు సందర్భంగా ఓ డీఎస్పీ సతీమణి చేసిన తప్పిదం… ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రభుత్వ అధికారి భార్యను అనే అహంకారంతో… ప్రభుత్వ వాహనంపైకి ఎక్కి బర్త్ డే కేక్ కట్ చేసి… ఇప్పుడు నలుగురిలో నవ్వుల పాలు అయింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
ఛత్తీస్గఢ్ లోని జంజ్గిర్-చాంపా జిల్లా డీఎస్పీ తస్లీం ఆరీఫ్ భార్య ఫర్హీన్ ఖాన్ తన పుట్టినరోజు వేడుకలను ఒక ప్రభుత్వ వాహనం ఉపయోగించడం వివాదాస్పదంగా మారింది. ఫర్హీన్ ఖాన్ తన పుట్టినరోజు సందర్భంగా.. పోలీసు శాఖకు చెందిన వాహనం బ్యానెట్పై కూర్చొని కేక్ కట్ చేసింది. ఈ కేక్ కటింగ్ సందర్భంగా… “స్నో స్ప్రే” తో వాహనం అద్దంపై “32” అని రాసింది. తరువాత డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి వైపర్స్తో దాన్ని తుడిచేశాడు. అనంతరం ఆమె మళ్లీ “33” అని రాస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఇదే సమయంలో కారు బ్యానెట్పై కేక్, పుష్పగుచ్ఛం కూడా ఉంచారు. ఈ రీల్ వీడియోను సరగానా రిసార్ట్ లో చిత్రీకరించినట్లు సమాచారం. ఇక కారు అలా ముందుకు పోతుంటే బ్యానెట్పై డీఎస్పీ సతీమణి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమయంలో సదరు పోలీసు వాహనంలో మరికొందరు మహిళలు కూడా ఉన్నారు. వారంతా ఎంజాయ్ చేస్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది.
దీనితో సదరు అధికారి భార్య తన పుట్టినరోజు వేడుకలకు ప్రభుత్వ వాహనం ఉపయోగించడం చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం అధికారిక వాహనాలు కేవలం ప్రభుత్వ అవసరాలకే వినియోగించాలి. వ్యక్తిగత వేడుకల కోసం ఇటువంటి వాహనాలను వినియోగించడం నిబంధనలకు విరుద్ధం. ముఖ్యంగా బ్లూ బీకాన్ వంటి అధికార గుర్తింపు చిహ్నాలున్న వాహనాలను వినియోగించడం నేరంగా పరిగణిస్తారు. దీనితో, డిఎస్పీ సతీమణి తీరుపై పలువురు నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఇప్పటివరకు సంబంధిత డీఎస్పీపై ఎలాంటి అధికారిక చర్య తీసుకోకపోవడం గమనార్హం.