China: చైనా బంపర్ ఆఫర్ ! మూడో బిడ్డను కంటే రూ.12 లక్షలు !
చైనా బంపర్ ఆఫర్ ! మూడో బిడ్డను కంటే రూ.12 లక్షలు !
China : ఒకరు లేదా అస్సలు వద్దు అంటూ కుటుంబ నియంత్రణ కోసం అత్యంత కఠినమైన ఆంక్షలు విధించి జనాభాను తగ్గించుకున్న చైనా… ఇప్పుడు పడిపోతున్న జనాభాను పెంచుకోవటానికి నానాతంటాలు పడుతోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురిని కన్నా ఫర్వాలేదు… డబ్బులిస్తాం అంటూ బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది. రెండో బిడ్డను కన్న తల్లిదండ్రులకు 50 వేల యువాన్లు (దాదాపు రూ.6 లక్షలు), మూడో బిడ్డను కన్న వారికి ఏకంగా లక్ష యువాన్లు (రూ.12 లక్షలు) ఇస్తామంటూ చైనాలో (China) ఓ రాష్ట్రమైన ఇన్నర్ మంగోలియా ప్రభుత్వం ప్రకటించటం అక్కడి పరిస్థితులను తేటతెల్లం చేస్తోంది. ఇదే బాటలో పలు స్థానిక ప్రభుత్వాలు నడుస్తున్నాయి. పిల్లల్ని కనే జంటలకు నగదు ప్రోత్సాహకాలు, గృహ నిర్మాణానికి సబ్సిడీలను ప్రకటించాయి.
China Offer to People
తాజాగా, అక్కడి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా యోచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పుట్టే ప్రతీ శిశువుకూ ఏటా 3,600 యువాన్ల (దాదాపు రూ.43 వేలు) చొప్పున మూడేళ్ల పాటు ఆ శిశువు తల్లిదండ్రులకు ఇచ్చే పథకంపై కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ ఏడాది జనవరి 1వ తేదీన, ఆ తర్వాత పుట్టిన శిశువులకు దీనిని వర్తింపజేయనున్నట్లు పేర్కొన్నాయి. జననాలు తగ్గటంతో చైనాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. ఉద్యోగాలు, పనులు చేయగల వయస్కుల సంఖ్య క్రమేణా తగ్గుతోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాకు ఇది తీవ్ర నష్టదాయక పరిణామం. ఇదే పరిస్థితి కొనసాగితే… 2100 నాటికి చైనా జనాభా ఏకంగా 80 కోట్లకు పడిపోతుందని ఐక్యరాజ్యసమితి జనాభా అంచనాల విభాగం లెక్కగట్టింది.
Also Read : Lalit Modi: లండన్ లోని ఓ పార్టీలో లలిత్ మోదీ, విజయ్మాల్యా ల డ్యాన్స్
