Chirag Paswan: మళ్లీ సీఎం కుర్చీ నితీష్ దే – చిరాగ్ పాశ్వాన్
మళ్లీ సీఎం కుర్చీ నితీష్ దే - చిరాగ్ పాశ్వాన్
Chirag Paswan : బిహార్ రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ నేతల వ్యాఖ్యలు, ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాస్వాన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. నితీష్ కుమార్ (Nitish Kumar) ఈ ఎన్నికల తర్వాత మళ్లీ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు. అంతేకాదు, బీహార్ ఓటర్ల జాబితా సవరణపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఊపును తీసుకొచ్చాయి.
మరోవైపు, చిరాగ్ పాస్వాన్ (Chirag Paswan) గతంలో నితీష్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నితీష్ ప్రభుత్వం నేరస్థుల ముందు లొంగిపోయిందని, ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు. కానీ, ఇప్పుడు ఆయన తన వైఖరిని మార్చుకుని, నితీష్ కుమార్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు.
Chirag Paswan – ప్రతిపక్షాలపై చిరాగ్ విసుర్లు
పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో విలేకరులతో మాట్లాడుతూ… చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) ప్రతిపక్షాలపై కూడా విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలు ఆపరేషన్ సిందూర్ను లక్ష్యంగా చేసుకుని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దాడి చేయడానికి సైన్యాన్ని ఉపయోగిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ ఉత్కంఠను మరింత పెంచాయి.
హాజీపూర్ ఎంపీ అయిన చిరాగ్ పాస్వాన్ , ఎన్డీఏ కూటమి ఈ ఎన్నికల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్నికలు జరుగుతాయని, ఈ ఎన్నికల ఫలితాల తర్వాత నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోదీపై తనకున్న నమ్మకాన్ని, నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలు ఎన్డీఏ కూటమి బీహార్లో బలంగా ఉందని, ఏకపక్ష విజయం సాధిస్తుందని చిరాగ్ భావిస్తున్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి.
ఓటర్ల జాబితా సవరణపై చిరాగ్ ఫైర్
బీహార్లో ఓటర్ల జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) గురించి కూడా చిరాగ్ పాశ్వాన్ మాట్లాడారు. సుప్రీంకోర్టులో ఈ విషయంపై జరుగుతున్న విచారణ గురించి ప్రస్తావించారు. ప్రతిపక్షాలు అనవసరమైన గందరగోళం సృష్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాలు లక్షలాది ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. కానీ, ఒక్క రుజువైనా చూపించాయా? తప్పుగా ఉన్న పేర్లను తొలగించడం సహజం. ఈ సవరణ ప్రక్రియకు నేను పూర్తి మద్దతు ఇస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఓటర్ల జాబితాను సరిచేయడం ద్వారా ఎన్నికల పారదర్శకతను పెంచవచ్చని చిరాగ్ పాస్వాన్ అభిప్రాయపడ్డారు.
Also Read : Dimple Yadav: డింపుల్ యాదవ్ పై ముస్లిం మత బోధకుడు అనుచిత వ్యాఖ్యలు
