CM Chandrababu Naidu: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేద్దాం –  సీఎం చంద్రబాబు

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేద్దాం -  సీఎం చంద్రబాబు

 

 

ఈ నెల 21న విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సర్వం సిద్ధం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకేచోట 5 లక్షల మందితో నిర్వహించే ఈ కార్యక్రమానికి విశాఖపట్నం వేదికకాబోతుందన్నారు. సోమవారం విశాఖ పర్యటనలో భాగంగా ఆర్కే బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ వేదికకు సంబంధించి ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన సీఎం చంద్రబాబు అధికారులకు పలు సూచనలు చేశారు. అక్కడ నుండి నేరుగా ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌ ను సందర్శించి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులు, కూటమి ప్రజాప్రతినిధులు, నేతలతో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లపై నోవాటెల్‌ లో సమీక్ష నిర్వహించారు.

 

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ… ‘నేను ఎప్పుడూ ఇష్టపడే నగరం విశాఖపట్నం. ఇక్కడ ప్రశాంతత, సానుకూల వైఖరి, మంచికి సహకరించే మనస్తత్వం కలిగిన ప్రజలు ఉంటారు. హుద్‌హుద్ తుఫాన్ వచ్చిన సమయంలో వారం రోజుల పాటు విశాఖపట్నంలోనే ఉన్నాను. సంయమనంతో సమిష్టిగా ఉండి విపత్తును ఎదుర్కొందామని ప్రజలకు పిలుపునిచ్చా. ప్రజలందరినీ సాధారణ స్థితికి తీసుకొచ్చేవరకు కొన్ని నియమాలు పాటించాలని కోరితే అంతా పాటించారు. ఆ సమయంలో దీపావళి పండుగ కూడా వచ్చింది. ఈదురుగాలులకు నేలకొరిగిన చెట్లన్నీ ఎండిపోయాయి. అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి, పండుగ జరుపుకోండి కానీ క్రాకర్స్ కాల్చవద్దని ప్రజల్ని కోరాను. క్రాకర్స్ కాల్చకుండా క్రమశిక్షణ, సామాజిక బాధ్యతతో మెలిగారు.

యోగాపై డిక్లరేషన్ ప్రకటిస్తాం

‘నేను ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాల్లో యోగా డేనే అత్యంత పెద్దది, గొప్పది. ఆరోగ్య రంగంలో పెద్ద గేమ్ ఛేంజర్ అవుతుంది. ఈ నెల 20న మాక్ ఈవెంట్ నిర్వహించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాం. విశాఖపట్నం యోగా డే డిక్లరేషన్ ప్రకటిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయగలుగుతాయో డిక్లరేషన్ ద్వారా ప్రకటిస్తాం.

గిన్నిస్ రికార్డు సాధిస్తాం

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు విశాఖ అనువైన ప్రదేశం, మీరు చేయగలుగుతారని ప్రధాని మోదీ చెప్పగానే విజయవంతంగా చేస్తామని చెప్పా. యోగాను ప్రపంచమంతా జరుపుకునేలా ప్రధాని మోదీ కృషి చేశారు. 21వ తేదీన పౌరులు పాల్గొనేందుకు ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సుందర నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం చేయడం మన అదృష్టం. యోగా భవిష్యత్తులో అందరి జీవితంలో భాగం కావాలి. టెక్నాలజీ యుగంలో తీరికలేకుండా గడుపుతున్నాం. అందరిలో ఉండే ఆందోళన, ఒత్తిడి, ఆరోగ్య సమస్యలకు యోగా పరిష్కారం. రాష్ట్రంలో యోగాంధ్ర థీమ్‌తో నెలరోజులపాటు కార్యక్రమం చేపట్టాం. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా నెల రోజులుగా యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 21వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 1 లక్ష ప్రదేశాల్లో నిర్వహిస్తాం. 2 కోట్లమంది యోగా డేలో పాల్గొంటారు. ఇప్పటికే 2.17 కోట్లమంది పాల్గొంటామని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 25 లక్షల మందికి సర్టిఫికెట్లు ఇస్తాం. గిన్నిస్ రికార్డుకు ప్రయత్నిస్తున్నాం..తప్పకుండా సాధిస్తాం.

విద్యార్థి దశనుంచే యోగా అలవాటు చేసుకోవాలి

‘9వ తరగతి పైన చదివే ప్రతి విద్యార్థి యోగా అలవాటు చేసుకోవాలి. మహిళలు, పురుషులు అనే వ్యత్యాసం లేకుండా అందరూ భాగస్వాములు కావాలి. శిక్షకులు, డాక్టర్లను అందుబాటులో ఉంచుతాం. ప్రతి 100 మందికి ఒక మరుగుదొడ్డి ఏర్పాటు చేశాం. యోగా కార్యక్రమానికి వచ్చే వారికి వాహన సదుపాయం కల్పించాం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. 11 నేవీ షిప్పుల్లో యోగాసనాలు ఉంటాయి. ఏదైనా అనివార్య పరిస్థితులు ఏర్పడి ఆర్కే బీచ్‌లో ఆంటంకం కలిగితే ప్రత్యామ్నాయంగా ఆంధ్రా యూనివర్సిటీలో కూడా నిర్వహించేలా ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే 3.5 లక్షల మందికి యోగా మ్యాట్స్ సిద్ధం చేశాం. 5 లక్షల మందికి టీ షర్ట్స్ అందిస్తాం.

వారసత్వ సంపద యోగా

ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్యమై ప్రజా ఉద్యమంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఇది ప్రజల కోసం చేసే కార్యక్రమం. యోగా వారసత్వ సంపద. భావితరాలకు అప్పగించే బాధ్యత మనమంతా తీసుకోవాలి. ప్రస్తుతం ఏదైనా ఆరోగ్య సమస్యకు మెడిసిన్ వేసుకుంటున్నాం. తర్వాత దాని ప్రభావం శరీరంలో తప్పకుండా చూపిస్తుంది. యోగాకు కొంత సమయం కేటాయించి చేస్తే ఇంట్లో వారికి, సమాజానికి భారం కాకుండా ఆరోగ్యంగా ఉంటాం. అన్ని వర్గాలు, మతాలు, కులాలు, ప్రాంతాలు కలసి చేయాల్సిన కార్యక్రమం ఇది. దీనిద్వారా మెరుగైన జీవన ప్రమాణం లభిస్తుంది. మా ప్రభుత్వం ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తోంది. 30 రోజుల కార్యక్రమం తర్వాత కూడా యోగా కార్యక్రమాలు కొనసాగించేలా ప్రయత్నిస్తాం.

కలుషిత ఆలోచనలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు

‘బిల్ గేట్స్ ఫౌండేషన్ ఏపీ వైద్య రంగంలో సేవలందించేందుకు ముందుకొచ్చింది. ప్రస్తుతం కుప్పంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాం. 6 నెలల్లో చిత్తూరు, రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా సేవలు నిర్వహిస్తాం. ఏపీని ఆరోగ్యాంధ్రగా మార్చుతా. హెల్తీ, వెల్తీ హ్యాపీ రాష్ట్రంగా మార్చుతాం. కలుషిత ఆలోచన చేస్తే కలుషిత ఫలితాలే వస్తాయి…స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తే స్వచ్ఛమైన పలితాలు వస్తాయి. ఇది మీడియా, సోషల్ మీడియా, రాజకీయ నాయకులు, సమాజంలో అన్ని వర్గాలకు వర్తిస్తుంది. కొందరు కలుషిత ఆలోచన చేసి సమాజాన్ని కలుషితం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. అలాంటి వారిని సమాజానికి దూరం పెడితేనే బాగుంటాం. లేదంటే సమస్యల సుడిగుండంలో ఇరుక్కుపోతాం.’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!