CM Chandrababu Naidu: టీడీపీ ఎమ్మెల్యేలకు, నాయకులకు సీఎం చంద్రబాబు క్లాస్

టీడీపీ ఎమ్మెల్యేలకు, నాయకులకు సీఎం చంద్రబాబు క్లాస్

 

 

టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిపై ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించారని… అందరూ అందుకు అనుగుణంగా ఎమ్మెల్యేలు నడుచుకోవాలని ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోరారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారనే విషయాన్ని ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని, పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై నమ్మకాన్నిపెంచే విధంగా ఎమ్మెల్యేలు వ్యవహరించాలని కోరారు. శనివారం తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలతో అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వివాదాల్లో

 

టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా సందర్భంగా జూన్ 12వ తేదీన అమరావతిలో 2 వేలమందితో ఓ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆ తర్వాత కూడా ఏపీవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. ఎమ్మెల్యేలు ఎవరెవరు ఏం చేస్తున్నారనే సమాచారం తన దగ్గర ఉందని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నేతలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే నాటికి ఏపీలో ఉన్న పరిస్థితులు కూడా ప్రజలకు తెలియజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. 2024 జూన్‌కి ముందు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని గుర్తుచేశారు. తాను నాలుగోసారి సీఎం అయ్యానని.. కానీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదని వెల్లడించారు సీఎం చంద్రబాబు.

 

అయినా ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తున్నామని తెలిపారు. మనం రాష్ట్ర సంక్షేమం కోసం యజ్ఞం చేస్తుంటే రాక్షసులు కొంతమంది భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఏపీలో గతంలో గంజాయి విచ్చలవిడిగా లభ్యం అయ్యేదని.. ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నామని అన్నారు. శాంతి భద్రతలు, గంజాయి, రౌడీయిజాన్ని నిర్ధాక్షిణ్యంగా అణచి వేస్తామని.. ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మహానాడు ఈసారి బాగా జరిగిందని చెప్పారు. వచ్చే నెల నాటికి అన్ని కమిటీలు, రాష్ట్ర కమిటీలను నియామకం పూర్తి చేస్తామని తెలిపారు. యోగా డేను జయప్రదం చేయాలని కోరారు. కార్యకర్తలు యోగా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఎవరినైనా వదులుకుంటాం – సీఎం చంద్రబాబు

‘‘పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై సర్వేలు చేయిస్తున్నాం. బాగా పనిచేసిన వారికి ప్రోత్సాహం ఉంటుంది. పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఎవరినైనా వదులుకుంటాం. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా పనిచేయాలి. ప్రజలు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండాలి. వన్‌టైమ్‌ ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదనేది నా ఆలోచన. ప్రజలు అన్నీ గమనిస్తారు.. జాగ్రత్తగా ఉండాలి. గత ప్రభుత్వంలో రాష్ట్రమంతా నిరాశ, నిస్పృహ, చీకటి అలముకుంది. భయంకర పరిస్థితులను రాష్ట్ర ప్రజలు చూశారు. రాష్ట్రం పేరు వింటేనే దగ్గరకు వచ్చే పరిస్థితి లేకుండా చేశారు. అసమర్థ పాలనతో ఏపీని ఆర్థికంగా పాతాళానికి తొక్కేశారు. మనం తీసుకునే నిర్ణయాలతోనే మంచి ఫలితాలు వస్తున్నాయి. గత ప్రభుత్వాన్ని భరించలేకే ప్రజలు ఏకపక్షంగా మనల్ని గెలిపించారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు, నివేదికలు ఉంటాయి. మంచి చేస్తే అభినందిస్తా… తప్పు చేస్తే దూరం పెడతా. త్వరలోనే ఒక్కో ఎమ్మెల్యేతో ముఖాముఖి భేటీలు నిర్వహిస్తా అని చంద్రబాబు తెలిపారు.

 

Leave A Reply

Your Email Id will not be published!