CM Chandrababu: కుప్పం మహిళకు సీఎం చంద్రబాబు ఫోన్

కుప్పం మహిళకు సీఎం చంద్రబాబు ఫోన్

 

 

చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో అప్పు తీర్చలేదన్న నెపంతో చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన ఘటనలో బాధితురాలు శిరీషతో సీఎం చంద్రబాబు ఫోన్‌ లో మాట్లాడారు. బాధితురాలు శిరీషను ఫోన్ లో పరామర్శించిన చంద్రబాబు… ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎప్పుడైనా వారి నుంచి వేధింపులు ఎదురయ్యాయా అని సీఎం చంద్రబాబు అడగ్గా… పలు సందర్భాల్లో తమను ఇబ్బంది పెట్టారని శిరీష వాపోయారు. ఈ ఘటనతో పిల్లలు, తాను భయపడుతున్నామని ముఖ్యమంత్రికి బాధితురాలు గోడు వెళ్లబోసుకుంది. ఈ సందర్భంగా బాధితురాలికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. పిల్లల చదువుకు హామీ ఇచ్చారు. అన్నివిధాలా అండగా ఉంటానని, ధైర్యంగా ఉండాలని సీఎం భరోసా ఇచ్చారు.

ఇలాంటి ఘటన దురదృష్ణకరమని, ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మానవత్వం లేకుండా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శిరీష పిల్లలు ఏం చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. వారిని బాగా చదివించాలని సూచించారు. ప్రభుత్వపరంగా అన్నివిధాలుగా అండగా ఉంటానని… ధైర్యంగా ఉండాలని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. మరో మారు ఏపీలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డ ఎంతటి వారైనా వదలనని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఈ ఘటన, తదనంతర పరిణామాలపై తనకు నివేదిక ఇవ్వాలని, బాధిత కుటుంబానికి అందుబాటులో ఉండి అవసరమైన సాయం పూర్తిగా అందేలా చూడాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

కుప్పం ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్

కుప్పం మండలం నారాయణపురంలో అప్పు తీర్చలేదనే నెపంతో మహిళను చెట్టుకు కట్టి హింసించిన ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ మేరకు బాధితురాలితో హోం మంత్రి అనిత వీడియో కాల్ లో మాట్లాడి… ధైర్యం చెప్పారు. అనంతరం మహిళ అప్పు తీర్చలేదని హింసించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.  ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ… మహిళ అప్పుతీర్చలేదని ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

 

కుప్పం ఘటనపై వైఎస్‌ జగన్‌ ఫైర్‌

చంద్రబాబు సొంత నియోజకవర్గంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు.. రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? అంటూ వైఎస్ జగన్ ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఇది నిదర్శనం అంటూ ధ్వజమెత్తారు… ‘మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా?. సాక్షాత్తూ మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసిస్తున్న ఘటన, మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే.

తిమ్మరాయప్ప అనే కూలీ అప్పు చెల్లించలేదనే కారణంతో అతని భార్య శిరీషను మీ పార్టీ కార్యకర్త చెట్టుకు కట్టేసి, హింసించాడు. ఆమె బిడ్డలు రోదిస్తున్నా సరే కనికరం చూపలేదు, విడిచిపెట్టలేదు. చంద్రబాబు.., మీ హయాంలో జరిగిన అనేక క్రూరమైన ఘటనల్లో ఇదొకటి. పొలిటికల్‌ గవర్నెన్స్‌, రెడ్‌బుక్‌ పేరిట మీరు నెలకొల్పిన దుష్ట సంప్రదాయంలో భాగంగా మీరు, మీ పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా చెలరేగిపోయి చేస్తున్న దుర్మార్గాలకు మహిళలు, యువతులు, బాలికలు ఇలా ఎందరో బలైపోతున్నారు. ఈ ఘటనతోపాటు, ఏడాదికాలంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరిగిన అన్యాయాలు, అఘాయిత్యాలను సీరియస్‌గా తీసుకోవాలని, చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టాలి’ అని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!