CM Chandrababu: సూపర్ సిక్స్ లో మరో పథకానికి డేట్ ఫిక్స్
సూపర్ సిక్స్ లో మరో పథకానికి డేట్ ఫిక్స్
CM Chandrababu : సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళా శక్తి పేరిట ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం హామీపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో మహిళలకు ఉచిత బస్సు పథకంపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) పలు కీలక సూచనలు చేశారు. ఈ పథకం అమలు చేయడంలో ఇబ్బందులు తలెత్తకుండా ఆక్యుపెన్సీకి తగ్గట్లుగా బస్సులు నడిపించాలని సూచించారు. తమ ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైనా ఆగస్ట్ 15వ తేదీ నుంచే ఈ పథకం అమలు చేయాలని తెలిపారు. ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టేవన్నీ ఈవీ, ఏసీ బస్సులే ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
CM Chandrababu – పురపాలక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం
అలాగే మున్సిపల్, పురపాలక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉండవల్లి నివాసంలో సమీక్షకు మంత్రి నారాయణ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అమృత్ స్కీమ్ కింద తాగునీరు పైప్లైన్ పనులకు టెండర్లు పిలిచామని సీఎం చంద్రబాబు తెలిపారు. వారంలో రూ.5,350 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలుస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు, విశాఖపట్నంలో చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నెల్లూరు, రాజమండ్రి ప్లాంట్లకు టెండర్లు పూర్తి అయ్యాయని చెప్పారు. కడప, కర్నూలు, విజయవాడ, తిరుపతి ప్లాంట్లకు త్వరలో టెండర్లు పిలుస్తామని అన్నారు. మున్సిపాలిటీల్లో ఆధునిక యంత్రాల కొనుగోలుకు రూ.225 కోట్లు కేటాయించామని తెలిపారు. వీలైనంత త్వరగా లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
Also Read : Vizianagaram Terror Case: ఎన్ఐఏ చేతికి విజయనగరం ఉగ్ర దాడి అనుమానితుల కేసు
