CM Chandrababu : ప్రజాస్వామ్యంలో నియంతలకు చోటులేదు – సీఎం చంద్రబాబు
ప్రజాస్వామ్యంలో నియంతలకు చోటులేదు - సీఎం చంద్రబాబు
CM Chandrababu : దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు పూర్తయ్యాయని, ఆ అరాచక, అప్రజాస్వామిక పాలన నేటికీ మానని గాయంగా మిగిలిందని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ‘సంవిధాన్ హత్యా దివస్’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఆరేళ్ల కిందట ఇదే రోజు ప్రజా వేదిక కూల్చారని… ప్రజావేదిక కూల్చివేతకు ఆరేళ్లు సందర్భంగా ఈ సంవిధాన్ హత్యా దివస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
‘‘ప్రజావేదిక కూల్చివేతతో గత ప్రభుత్వం విధ్వంస పాలనకు తెరతీసింది. ఎమర్జెన్సీని మించిన నియంతృత్వ పాలన గత ఐదేళ్లూ చూశాం. ప్రజాస్వామ్యంలో నియంతలకు, విధ్వంసకారులకు చోటు లేదు. నియంతలకు చోటులేదని ఓటుహక్కు ద్వారా ప్రజలు చాటిచెప్పారు. కూల్చివేత నేతలను పంపించి.. పునర్మిర్మాణ బాధ్యతలు మాకు ఇచ్చారు. రాష్ట్ర పురోగతి కోసం కసి, పట్టుదలతో పనిచేస్తున్నాం’’ అన్నారు.
CM Chandrababu – వైఎస్ జగన్ కు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan) ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ మూకలు ఇంకోసారి రప్పా రప్పా అంటే ప్రజలు ఎదురు తిరిగి కొడతారని హెచ్చరించారు. జగన్ అతని బ్యాచ్ ఆటలు ఇకపై సాగవని వార్నింగ్ ఇచ్చారు. బుధవారం ఏపీ సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ పల్నాడు జిల్లా పర్యటనతో ముగ్గురు ప్రాణాలను తీశారని ఫైర్ అయ్యారు. అంబులెన్స్ సైరన్ వినిపిస్తే చిన్న పిల్లలు కూడా పక్కకు తప్పుకుంటారని… కానీ జగన్ తన కాన్వాయ్ని రోడ్డు మీదనే ఉంచడంతో అన్యాయంగా ఓ యువకుడు ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రచార పిచ్చితో మధు అనే యువకుడి ప్రాణం పోయిందని అన్నారు. ఆ రోజు అంబులెన్స్కు దారి ఇచ్చి ఉంటే మధు బతికేవారని తెలిపారు హోం మంత్రి అనిత.
పోలీసుల సూచనలు సైతం పెడచెవిన పెట్టి మరీ మనుషుల ప్రాణాలు తీస్తుంటే ఊరుకోవాలా అని హోం మంత్రి అనిత ప్రశ్నించారు. మైండ్ గేమ్లతో వైసీపీ మూకలు చేస్తున్న కుట్రలపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. జగన్ తాలూకూ సైకో నైజాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. విధ్వంసం, విద్వేషానికి బ్రాoడ్ అంబాసిడర్ జగన్ అని ఆరోపించారు. ఎక్కడ ఎవరూ చనిపోతారా అని ఎదురు చూస్తున్న ఆయన స్వభావం అందరికీ అర్ధమవుతోందని చెప్పుకొచ్చారు హోం మంత్రి అనిత.
ఎమర్జెన్సీ విధించిన రోజునే జగన్ ప్రజావేదిక కూల్చారని హోం మంత్రి అనిత మండిపడ్డారు. విధ్వంసాలను మళ్లీ రెచ్చగొట్టేందుకు జగన్ సిద్ధమవుతున్నారని ధ్వజమెత్తారు. 2019 నుంచి రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలనే నడిచిందని ఆక్షేపించారు. ఇప్పుడు నీతులు చెబుతున్న జగన్కు గత ఐదేళ్ల విధ్వంసాన్ని అతనికే గుర్తు చేయాలని అన్నారు. నోటి పారుదల శాఖ నుంచి అంబటి రాంబాబు ఇంకా బయటకు రానట్లున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు.
Also Read : Sugavasi Balasubramaniam: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సుగవాసి బాల సుబ్రమణ్యం
