CM Mamata Banerjee: వైద్య విద్యార్థిని అత్యాచారంపై సీఎం మమత షాకింగ్ కామెంట్స్
వైద్య విద్యార్థిని అత్యాచారంపై సీఎం మమత షాకింగ్ కామెంట్స్
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శుక్రవారం(అక్టోబర్ 10వ తేదీ) వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరగడంపై సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది తనను షాక్కు గురి చేసిందని, బాధితురాలికి కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అర్థరాత్రి సమయంలో సదరు విద్యార్థిని బయటకు వెళ్లడాన్ని మీడియా సమక్షంలో ప్రశ్నించారు. అసలు అర్థరాత్రి సమయంలో విద్యార్థులను క్యాంపస్ నుండి బయటకు ఎలా వెళ్లనిచ్చారని సీఎం మమతా (Mamata Banerjee) నిలదీశారు. ఇది సరైన పద్ధతి కాదని, విద్యార్థుల క్యాంపస్లు అనేవి అత్యంత పకడ్భందీగా ఉండాలని ఆమె అన్నారు.
ఈ ఘటనకు పాల్పడిన నిందితుల్ని పట్టుకుని శిక్ష పడేలా చేస్తామన్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న కాలేజీల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. నైట్ కల్చర్ కు విద్యార్థుల్ని దూరంగా ఉంచాల్సిన బాధ్యత ఆయా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలేదేనని స్పష్టం చేశారు. మరో వైపు విద్యార్థులు కూడా తమని తాము రక్షించుకునేలా ఉండాలన్నారు. ఆ విద్యార్థిని కాలేజ్ క్యాంపస్ నుండి రాత్రి గం. 12,30 ని.లకు ఎలా వచ్చిందన్నారు మమత. ఇక బీజేపీ అధికారంలో ఉన్న ఒడిశాలో కూడా ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని, అలాగే ఉత్తర్ప్రదేశ్, మణిపూర్, బీహార్లలో కూడా అత్యాచార ఘటనలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
CM Mamata Banerjee – మమత వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్
మమతా బెనర్జీ (Mamata Banerjee) వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ మండిపడింది. బాధితురాలికి న్యాయం జరిగే మాటను పక్కను పెట్టి, వేరే ఏవో కథలు సీఎం మమత చెబుతున్నారని ధ్వజమెత్తింది. ఆర్జీ కర్, సందేశ్ఖలి తర్వాత, ఇప్పుడు ఈ భయంకరమైన కేసులో న్యాయం కాకుండా, ఆమె బాధితురాలినే నిందిస్తున్నారు’ అని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. అంటే సీఎం మమతా చెప్పేది ఏమిటంటే.. అర్థరాత్రి అమ్మాయిలనేవారు బయటకు వెళ్లొదని చెబుతున్నారా? అంటూ ప్రశ్నించారు.
CM Mamata Banerjee – వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురి అరెస్టు
పశ్చిమబెంగాల్లో (West Bengal) ఒడిశాకు చెందిన ఓ వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారి వివరాలు వెల్లడించలేదు. బాలేశ్వర్ జిల్లాకు చెందిన యువతి(23) దుర్గాపుర్లోని శోభాపుర్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం రాత్రి ఆమె తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లింది. పలువురు దుండగులు వీరిని వెంబడించారు. బాధితురాలిని బెదిరించి సమీప అడవిలోకి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం బయట ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాధితురాలిని బెదిరించారు. తీవ్ర రక్తస్రావంతో స్పృహ తప్పిన బాధితురాలిని గమనించిన కొందరు స్థానికులు సమీప ఆసుపత్రిలో చేర్పించగా… ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న ఆమె తల్లిదండ్రులు శనివారం ఉదయం దుర్గాపుర్ చేరుకున్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. బాధితురాలి స్నేహితుడు కూడా ఈ నేరంలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలిని తప్పుదారిపట్టించి.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడని.. ఆ తర్వాత ఆమె నుంచి ఫోన్, డబ్బును లాక్కొన్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో బాధితురాలి స్నేహితుడితోపాటు చాలా మందిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆమె వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు ఎక్స్లో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని ప్రజలను కోరారు.
Also Read : NDA Alliance: బిహార్ ఎన్డీయే కుదిరిన సీట్ల సర్దుబాటు
