CM Revanth Reddy: నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్
నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్
తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని గతంలో రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి రెండోసారి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో విచారణ నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరు కావడం గమనార్హం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బేగంబజార్, నల్గొండ, మెదక్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు హాజరయ్యారు. నల్గొండ టూ టౌన్ పీఎస్, బేగంబజార్ పీఎస్, మెదక్ జిల్లా కౌడిపల్లి పీఎస్ పరిధిలో నమోదైన మూడు కేసుల్లో వ్యక్తిగతంగా జడ్జి ముందు హాజరయ్యారు. సీఎం కోర్టుకు హాజరు కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు హాల్ దగ్గరకు ఇతరులను అనుమతించలేదు. రేవంత్ రెడ్డిపై ఈ కేసులు నమోదైన సమయంలో ఆయన పీసీసీ చీఫ్గా ఉన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి… తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. పోలీసులు చెప్తున్నవి అన్నీ కూడా అవాస్తవాలు. తాను ఎక్కడ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ కోర్టు నమోదు చేసుకుంది. ఈ మేరకు జూన్ 12వ తేదీన నాంపల్లి స్పెషల్ కోర్టు తీర్పు ప్రకటించనుంది. ఇక, విచారణ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కోర్టు నుంచి తిరిగి వెళ్ళిపోయారు.