CM Revanth Reddy: జైపాల్ రెడ్డి డెమోక్రసీ అవార్డు ప్రదానోత్సవంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
జైపాల్ రెడ్డి డెమోక్రసీ అవార్డు ప్రదానోత్సవంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy : దేశ రాజకీయాల్లో సైద్ధాంతిక రాజకీయాలు పోయి… మేనేజ్మెంట్ పాలిటిక్స్ కీరోల్ ప్లే చేస్తున్నాయని తెలంగాణా సీఎం అభిప్రాయపడ్డారు. ఐడియాలజికల్ పాలిటిక్స్ పోయి… స్విగ్గీ పాలిటిక్స్ వచ్చాయన్నారు. కార్యకర్తలు పోయి వాలంటీర్ వ్యవస్థ వస్తోందన్నారు. కార్యకర్తలు లేని రాజకీయాలు దేశ భవిష్యత్ కు ప్రమాదకరమన్న రేవంత్… యూనివర్సిటీలలో విద్యార్థి రాజకీయలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ రాజకీయాల్లో ధన ప్రవాహం తగ్గించాల్సిన అవసరం ఉందని, ప్రతిపక్షాలు సహేతుకమైన సూచన చేస్తే తీసుకోవడానికి మాకు ఇబ్బంది లేదని రేవంత్ స్పష్టం చేశారు. అందుకే తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు శాసనసభ నుంచి ఎవరినీ సస్పెండ్ చేయలేదని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు.
దేశ రాజకీయాల్లో జైపాల్ రెడ్డి ఒక నిలువెత్తు శిఖరం అని కొనియాడిన రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)… పీవీ, జైపాల్ రెడ్డి (Jaipal Reddy) లాంటి వారి స్ఫూర్తి తెలంగాణ రాజకీయాల్లో ఉండాలని ఆకాంక్షించారు. ‘జైపాల్ రెడ్డి డెమోక్రసీ అవార్డు’ ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక అంశాలపై కూలంకషంగా మాట్లాడారు. విద్యార్థి నాయకుడిగా, శాసన సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా వివిధ హోదాల్లో జైపాల్ రెడ్డి గారు పని చేసి, దేశానికే తలమానికమైన పనులు చేశారని చెప్పారు.
CM Revanth Reddy – స్వర్గీయ జైపాల్ రెడ్డి గురించి సీఎం రేవంత్ ఏమన్నారంటే ?
‘1969 లో తొలిసారి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి జైపాల్ రెడ్డి (Jaipal Reddy) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాలుగుసార్లు శాసనసభ్యుడిగా, 5 సార్లు లోక్ సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. పెట్రోలియం శాఖ నిర్వహిస్తున్న సమయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. సమాచార శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రసార భారతి చట్టాన్ని దేశానికి అందించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర ఉండాలని ఆయన విశ్వసించి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. పార్లమెంట్ లో రాణించిన వారి నుంచి మేధావుల వరకు ఎవరితోనూ జైపాల్ రెడ్డి గారితో వ్యక్తిగత వైరం లేదు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా దేశ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. చివరి శ్వాస వరకు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేశారు. పరిపాలనలో తీసుకురావాల్సిన మార్పులపై జైపాల్ రెడ్డి ఎక్కువ ఆలోచించేవారు.
ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కల్వకుర్తి ప్రాంతంలో విద్యుత్ అవసరమని గుర్తించి అభివృద్ధికి బాటలు వేశారు. రాజకీయాలలో ధన ప్రవాహం తగ్గించాలని ఆయన ప్రయత్నించారు. తెలంగాణ ఏర్పాటులో ఆయన పాత్ర లేకపోతే ఇవాళ తెలంగాణ వచ్చేది కాదు. చర్చ లేకుండానే పార్లమెంట్ లో తెలంగాణ బిల్ ఆమోదించేలా జైపాల్ రెడ్డి ప్రత్యేక పాత్ర పోషించారు. జైపాల్ రెడ్డి గారి చొరవతోనే తెలంగాణ ఏర్పాటు చేశామని సోనియా గాంధీ ఒక సందర్భంలో నాతో చెప్పారు. కాంగ్రెస్ ను వీడినా, తిరిగి కాంగ్రెస్ లో చేరినా సైద్ధాంతిక విభేదాలే తప్ప… పదవుల కోసం ఆయన పార్టీలు మారలేదు,’ అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Also Read : Government School: రాజస్థాన్ లో తప్పిన పెను ప్రమాదం ! కూలిన ప్రభుత్వ స్కూలు పైకప్పు!
