MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత లేఖపై ఘాటుగా స్పందించిన కాంగ్రెస్, బీజేపీ

ఎమ్మెల్సీ కవిత లేఖపై ఘాటుగా స్పందించిన కాంగ్రెస్, బీజేపీ

 

 

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీర్ కు అతని కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభను ఉద్దేశ్యించి…అందులో పాజిటివ్, నెగిటివ్ అంశాలను క్రోడీకరించి ఎమ్మెల్సీ కవిత లేఖ రాసింది. అయితే ఇప్పుడు ఆ లేఖతో బీఆర్ఎస్ ను కార్నర్‌ చేసి.. బీజేపీ, కాంగ్రెస్‌లు పోటాపోటీగా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో అంశంపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమార్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 

ఈ సందర్భంగ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ… కవిత లేఖ ‘కాంగ్రెస్ వదిలిన బాణం‘ అనే OTT ఫ్యామిలీ డ్రామా. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ విఫలం. కుటుంబ పార్టీ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం. కుటుంబ పార్టీ వాటి సొంత సంక్షోభాన్ని ప్రజల ఎమోషన్లుగా మార్చాలని చూస్తోంది. కానీ, తెలంగాణ ప్రజలు ఈ లేఖ డ్రామాని పట్టించుకోవడం లేదు. బీజేపీ ఎవరినీ జైలుకు పంపదు. చట్టం ఆ పని చేస్తుంది. తప్పు చేసినవారు చట్టం నుంచి తప్పించుకోలేరు. తెలంగాణలో ప్రతీ సర్వే బీజేపీ గ్రాఫ్‌ పెరుగుతోందని చెబుతోంది. అధికారం… ఆర్భాటాలు లేకున్నా బీజేపీని ప్రజలు నమ్ముతున్నారు. వాళ్లు కోరుకునేది అభివృద్ధి.. నిజమైన మార్పు. అంతేగానీ పొలిటికల్‌ ఫ్యామిలీ డ్రామాలు కాదు. నిజమైన మార్పు బీజేపీ తోనే సాధ్యమని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు’’ అని ట్వీట్‌ చేశారాయన.

 

కవిత లేఖ ఓ డ్రామా – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఎమ్మెల్సీ కవిత లేఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కుటుంబం మరో డ్రామాకు తెరలేపిందన్నారు. ‘‘కవిత లేఖ ఉత్తదే. కేసీఆర్‌కు సలహా ఇచ్చే స్థాయిలో కవిత ఉందా ?. బీజేపీ పై ఎంతసేపు మాట్లాడాలో కవిత డిసైడ్ చేస్తదా ?. కేటీఆర్ హరీష్ రావులే ఈ లేఖ తయారు చేయించారు. కవిత పేరుతో బయటకు వదిలారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలసి పోటీ చేయడం ఖాయం. ఈ లేఖతోనే బీజేపీ, బీఆర్ఎస్ బంధం బయటపడింది. వరంగల్ సభతో బీఆర్ఎస్ పని అయిపోయిందని తేలిపోయింది. అందుకే ఈ డ్రామాలు’’ అని ఆయన అన్నారు.

 

మరోవైపు… ఈ లేఖపై కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్‌ కీలక నేతలు స్పందించేందుకు నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కవిత లేఖపై స్పందించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సీనియర్‌ నేత హరీష్‌రావును మీడియా కోరగా.. ఇద్దరూ స్పందించలేదు. ఓ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్‌ మైక్‌ను పక్కకు తోసేయగా… హరీష్‌రావు మాత్రం కవిత లేఖపై త్వరలో స్పందిస్తామంటూ హడావిడిగా కారెక్కి వెళ్లిపోయారు. కిందటి నెల 27న వరంగల్‌ ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ ధూం ధాం సభ సక్సెస్‌ అయ్యిదంటూనే… అది పార్టీ కార్యకర్తలను ఆకట్టుకోలేకపోయిందంటూ కొన్ని ప్రతికూల పాయింట్లను ఆమె లేఖలో ప్రస్తావించినట్లు నోట్‌ ఒకటి తెర మీదకు వచ్చింది. పైగా బీజేపీ గురించి తక్కువ మాట్లాడేసరికి ఆ పార్టీతో పొత్తు ఉండబోతుందనే ప్రచారం బలంగా సాగుతోందంటూ అందులో వివరణాత్మకంగా రాసి ఉంది.

 

కవిత లేఖపై అనుమానాలు – డీకే అరుణ

కేసీఆర్‌కు కవిత లేఖ లేఖ రాయాల్సిన అవసరం ఏముందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ లేఖ బయటకు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారామె.

Leave A Reply

Your Email Id will not be published!