National Herald Case: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు

National Herald Case : నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కేసుతో సంబంధమున్న ‘యంగ్‌ ఇండియన్‌’ కంపెనీ నిధుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తన దర్యాప్తు పరిధిని విస్తృతం చేసింది. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)తో ముడిపెట్టిన ఈ వ్యవహారంలో కోర్టుకు గత నెలలో సమర్పించిన అభియోగపత్రంలో కాంగ్రెస్‌ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, మరో ముగ్గురిని ప్రధాన నిందితులుగా పేర్కొంది. ఎన్నికల్లో పార్టీ టికెట్లు కేటాయిస్తామని, పదవులకు ఎంపికచేస్తామని, వ్యాపారాలకు రక్షణ కల్పిస్తామంటూ వివిధ వ్యక్తుల నుంచి పార్టీ సీనియర్‌ నాయకుల ద్వారా వీరు అక్రమార్జనకు పాల్పడ్డారని తెలిపింది. ఈ క్రమంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని చెబుతున్న దర్యాప్తు సంస్థ… తన ఆరోపణలకు సాక్ష్యంగా ‘యంగ్‌ ఇండియన్‌’కు విరాళాలు ఇచ్చిన వారిని పేర్కొంది.

2022లో ‘యంగ్‌ ఇండియన్‌’కు తెలంగాణ కాంగ్రెస్‌(Congress) నేతలు రూ.80 లక్షలకుపైగా విరాళాలు ఇచ్చారని… ఆ సమయంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) (ప్రస్తుత ముఖ్యమంత్రి) సూచనతో ఈ చెల్లింపులు జరిగాయని ఈడీ పేర్కొంది.

2022 జూన్‌లో గాలి అనిల్‌ కుమార్‌ రూ.20 లక్షలను విరాళంగా అందించారు.

మాజీ ఎమ్మెల్యే షబ్బీర్‌ అలీ రూ.20 లక్షలు, అప్పటి తెలంగాణ కాంగ్రెస్‌ కోశాధికారి పి.సుదర్శన్‌ రూ.15 లక్షలు, నాటి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రూ.25 లక్షలు విరాళం ఇచ్చారు. మరికొందరు కాంగ్రెస్‌ నాయకులు కూడా నిధులు సమకూర్చిన వారిలో ఉన్నారు.

National Herald Case- కర్ణాటక నాయకుల పేర్లు కూడా

పార్టీ సీనియర్‌ నేత పవన్‌ బన్సల్‌ సూచనతో 2022 ఏప్రిల్‌లో కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డి.కె.శివకుమార్, ఆయన సోదరుడు డి.కె.సురేశ్‌ ఒక్కొక్కరు రూ.25 లక్షల చొప్పున ‘యంగ్‌ ఇండియన్‌’కు విరాళమందించారని ఈడీ తెలిపింది. అదే నెలలో శివకుమార్‌కు చెందిన నేషనల్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ రూ.2 కోట్ల భారీ మొత్తాన్ని అందజేసింది. పంజాబ్‌కు చెందిన అమిత్‌ విజ్‌ 2015లో మూడు విడతల్లో కలిపి రూ.3.30 కోట్లు చెల్లించారు. ఈ నేపథ్యంలో ‘యంగ్‌ ఇండియన్‌’కు వచ్చిన విరాళాలన్నీ సందేహాస్పదమైనవేనని ఈడీ భావిస్తోంది. పీఎంఎల్‌ఏ నిబంధనల ఉల్లంఘన జరిగిందనే కోణంలో దర్యాప్తు అధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది. విరాళాలు అందించిన వ్యక్తులకు త్వరలోనే నోటీసులు పంపించి ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సంస్థ సీనియర్‌ అధికారులు.

Also Read : KTR: ఎమ్మెల్సీ కవితకు కేటీఆర్‌ స్వీట్ వార్నింగ్‌

Leave A Reply

Your Email Id will not be published!