Covid 19: దేశంలో విజృంభిస్తోన్న కోవిడ్ ! 3 వేలు దాటిన కొవిడ్ కేసులు !
దేశంలో విజృంభిస్తోన్న కోవిడ్ ! 3 వేలు దాటిన కొవిడ్ కేసులు !
Covid 19 : ఇండియాలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం శనివారం నాటికి దేశంలో మొత్తం 2,710 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. కేరళలో అత్యధిక కేసులు వస్తున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర, దిల్లీ తరువాత స్థానంలో ఉన్నాయి. కేరళలో 1,147 కేసులు, మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్లో 223 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో ఇంతవరకూ 148 కేసులు నమోదు కాగా, కర్ణాటకలో 148, పశ్చిమబెంగాల్లో 116 కేసులు నమోదయ్యాయి. నాలుగు రోజుల్లోనే కేసులు వేగంగా పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
దేశంలో మే 26న మొత్తం 1,010 కేసులు నమోదవగా… మే 30 నాటికి మొత్తం 2,710కు పెరిగినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెల్లడించింది. కరోనా(Covid 19) కొత్త వేరియంట్లపై భయాందోళనలు అవసరం లేదని.. ఇన్ఫెక్షన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Covid 19 – రాష్ట్రాల వారీగా కొవిడ్ కేసులు
డేటాబోర్డులో వెల్లడించిన సమాచారం ప్రకారం… దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 2,710గా ఉండగా, కేరళలో అత్యధికంగా 1,147 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 424, దిల్లీలో 294, గుజరాత్లో 223, తమిళనాడులో 148, కర్ణాటకలో 148, పశ్చిమబెంగాల్లో 116, రాజస్థాన్లో 51 కేసులు, ఉత్తరప్రదేశ్లో 42, పుదుచ్చేరిలో 25, హరియాణాలో 20, ఆంధ్రప్రదేశ్లో 16, మధ్యప్రదేశ్లో 10, గోవాలో 7, ఒడిశా, పంజాబ్, జమ్మూకశ్మీర్లలో ఒక్కో రాష్ట్రంలో నాలుగు చొప్పున కేసులు నమోదయ్యాయి. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్ రాష్ట్రాలలో ఒక్కో రాష్ట్రంలో మూడు కేసులు నమోదవగా.. మిజోరం, అస్సాంలలో చెరో ఇద్దరు ఈ ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు తెలుస్తోంది.
కాగా, దేశవ్యాప్తంగా 7 మరణాలు సంభవించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీలో ఒక్కొక్కరు చొప్పున మరణించగా, వీరికి కోవిడ్(Covid 19) తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్టు గుర్తించారు. తక్కిన ఐదుగురు కరోనా ఇన్ఫెక్షన్తోనే మరణించారా అనేది ఇంకా స్పష్టం కాలేదు. మరణించిన వారిలో పంజాబ్కు చెందిన ఒక వ్యక్తి మినహా తక్కిన వారంతా సీనియర్ సిటిజన్లేనని అధికారులు తెలిపారు. కాగా, ఒమైక్రాన్ వేరియంట్కు చెందిన ఎల్ఎఫ్.7, ఎన్బీ.1.8.1 అనే కరోనా సబ్ వేరియంట్ల వల్ల కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఆందోళన పడాల్సిన పని లేదని, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read : Jairam Ramesh: ప్రధాని మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ విసుర్లు