CRPF: కాశ్మీర్ లోయలో జారిపడ్డ సీఆర్పీఎఫ్ వాహనం ! పది మంది జవాన్లకు గాయాలు !
కాశ్మీర్ లోయలో జారిపడ్డ సీఆర్పీఎఫ్ వాహనం ! పది మంది జవాన్లకు గాయాలు !
CRPF : జమ్మూకాశ్మీర్ లోని బుద్గామ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీఆర్పీఎఫ్ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ సంఘటనలో పది మంది దాకా జవాన్లు గాయపడ్డారు. లోయలోపడ్డ వాహనం 181 బెటాలియన్కు సంబంధించిందిగా తెలుస్తోంది. తంగనర్ కొండ ప్రాంతంలో వాహనం వెళుతూ ఉండగా అదుపు తప్పింది. వెంటనే బోర్లా పడి… లోయలోకి దొర్లుకుంటూ వెళ్లిపోయింది. గాయపడ్డ వారిలో ఎనిమిది మంది సీఆర్పీఎఫ్(CRPF) జవాన్లు కాగా.. మిగిలిన ఇద్దరు జమ్మూకాశ్మీర్ పోలీస్ శాఖకు చెందిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు.
CRPF Vehicle Accident
గాయపడ్డవారిలో 9 మంది స్పెషల్ క్విక్ యాక్షన్ టీమ్ కు చెందిన వారిగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వాహనం బోల్తా పడిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. గాయపడ్డ వారిని బయటకు తీసుకురావటానికి సాయం చేశారు. గాయపడ్డ వారిని మొదటగా ఖాన్సాహిబ్లోని సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే, గాయాలు తీవ్రంగా ఉండటంతో వారిని శ్రీనగర్లోని 92 బేస్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ వారికి ప్రత్యేక చికిత్స అందుతోంది.
ఇక, ఈ సంఘటనపై అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రోడ్డు సరిగా లేకపోవటం లేదా వాహనంలో సమస్య కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే, దీనిపై అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. సీనియర్ పోలీస్ అధికారులు దీనిపై మాట్లాడుతూ… వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ వెరిఫై చేయాల్సి ఉందని, దర్యాప్తు మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని అన్నారు. కాగా, జమ్మూకాశ్మీర్లోని రోడ్లు, ఇతర పరిస్థితులతో జవాన్లు నిత్యం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.
Also Read : CM Chandrababu : వైసీపీ హయాంలో 10 లక్షల కోట్ల రుణాలు తెచ్చి ఏం చేశారో లెక్కలేదు