Dhiman Chakma IAS: లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ యంగ్ ఐఏఎస్
లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ యంగ్ ఐఏఎస్
త్రిపురలోని గ్రామీణ నేపథ్యమున్న ధీమన్ ఛక్మాకు గత ఆరేళ్లుగా ప్రజల్లో ఎంతో మంచిపేరుంది. రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) పరీక్షల్లో మెరుగైన ర్యాంక్ లు సాధించి శెభాష్ అనిపించుకున్న ఛక్మా… ప్రస్తుతం ఒడిశాలోని ధర్మగఢ్ సబ్–కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఒక వ్యాపారి నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకుంటున్న ఛక్మాను విజిలెన్స్ అధికారులు రెడ్హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఐఏఎస్ ఛక్మాను అరెస్ట్ చేసి స్థానిక కోర్టు ఆదేశాల మేరకు 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు.
ఆదివారం కలహండీ జిల్లాలోని ఛక్మా నివాసంలో విజిలెన్సు అధికారులు రూ.47 లక్షల నగదును స్వాదీనంచేసుకున్నారు. తనకు రూ.20 లక్షలు లంచం ఇవ్వకపోతే నీ అంతు చూస్తానని స్థానిక వ్యాపారిని సబ్–కలెక్టర్ హోదాలో ఛక్మా బెదిరించాడు. దీనితో ఆ వ్యాపారి తమను ఫిర్యాదుచేశారని విజిలెన్స్ ఎస్పీ ఎం.రాధాకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జప్తు చేసిన నగదు విషయంలో ఆయన ఎలాంటి సంజాయిషీ ఇవ్వకపోవడంతో అవినీతి నిరోధక(సవరణ)చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం సబ్–కలెక్టర్పై కేసు నమోదుచేసి అరెస్ట్చేశారు.
ఎవరీ ఛక్మా ?
త్రిపురలోని కంచన్పూర్ కు చెందిన ఈ యువ అధికారి 2019లోనే యూపీఎస్సీలో 722 ర్యాంక్ సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్)లో చేరారు. ఒడిశా కేడర్ ఐఎఫ్ఎస్ అధికారిగా ఒడిశాలోని మయూర్భంజ్లోని బరిపదలో అదనపు చీఫ్ కన్జర్వేటర్గా పనిచేశారు. రెండేళ్లకే మళ్లీ 2021లో యూపీఎస్సీ రాసి ఈసారి 482 ర్యాంక్ సాధించారు. దీనితో ఈసారి ఐఏఎస్ హోదా సాధించారు. శిక్షణ తర్వాత ధర్మగఢ్ సబ్–కలెక్టర్గా పోస్ట్ఇవ్వడంతో అప్పటి నుంచి అ క్కడే పనిచేస్తున్నారు. రెండుసార్లు అఖిల భారత సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణుడై అప్పట్లో ఈశాన్య రాష్ట్రాల యువతకు ఆదర్శంగా నిలిచిన యంగ్ ఐఏఎస్ ఛక్మా… ఇప్పుడు అవినీతికి పాల్పడి జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు.