అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల్లో నమ్మకం, భరోసా కల్గించేలా కొత్త పాస్ పుస్తకాలను అందచేయాలని ఆదేశించారు. ఈ నెల 2వ తేదీ నుంచి మొదలైన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీపై ఇవాళ కీలక సమీక్ష నిర్వహించారు. భూ రికార్డుల్లో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దాలని ఆదేశించారు. రికార్డులను తారు మారు చేయడానికి ఆస్కారం లేని విధంగా కొత్త పాస్ పుస్తకాలు ఉన్నాయని సీఎం అన్నారు. ఇప్పటి వరకు 6.07 లక్షల పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశామని అధికారులు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో స్వయం సహాయ సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్ అంశాలపై కీలక సూచనలు చేశారు నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ హెచ్ జీలు తయారు చేస్తున్న 23 వేలకు పైగా ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి బ్రాండింగ్, మార్కెటింగ్ జరగాలని దిశానిర్దేశం చేశారు. ఎస్ హెచ్ జీ మహిళా సంఘాలు, మైక్రో ఎంట్రప్రెన్యూర్స్ కు ఆర్ధిక సుస్థిరత వచ్చేలా ఉత్పత్తులను వ్యవస్థీకృతం చేయాలని సూచించారు. మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్, సెర్ప్ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారు . ప్రధానంగా స్వయం సహాయక సంఘాలు మరింత సాధికారిత సాధించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంత సాయం చేసేందుకైనా సిద్దంగా ఉందని ప్రకటించారు. ఈ దేశంలోనే మన స్వయం సహాయక సంఘాలు టాప్ లో నిలవాలని, అందు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు సీఎం.
