#Celebrities : డ్రగ్స్..సెలబ్రిటీలు: తర్వాత ఎవరు?
‘రియా’ చెప్పిన లిస్ట్: ఇంకా ఎంతమంది సెలబ్రిటీలు ఉన్నారు?
బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో మళ్లీ ఒక్కసారిగా డ్రగ్స్ తెరపైకి వచ్చాయి. అసలెందుకు సుశాంత్ డ్రగ్స్ తీసుకున్నాడు..ఎవరిచ్చారు? కావాలని ఇచ్చారా? లేదంటే ఇది సహజంగా జరిగిందా? అనే కోణంలో విచారిస్తున్నారు. ఈ క్రమంలో రియా చక్రవర్తి 25మంది సెలబ్రిటీల పేర్లు రాసి ఇచ్చిందని, వాటిని నిశితంగా పరిశీలిస్తున్నామని సీబీఐ అధికారులు చెబుతున్నారు, అవన్నీ నిజమని నిరూపణ అవుతున్నాయి కూడా.. అందుకు నిదర్శనంగా బాలీవుడ్ లో ప్రముఖ కథానాయికలు దీపికా పదుకునే, శ్రద్ధా కపూర్, సారా ఆలీఖాన్ ఇంకా టాలీవుడ్ లో ప్రముఖ నటి రకుల్ ప్రీతి సింగ్ వీరిని అప్పుడే అధికారులు పిలవడం, వెళ్లడం, కలవడం, రావడం అంతా జరిగిపోయింది. తర్వాత ఎవరన్నది సస్పెన్స్ గా మారింది.
అయితే అధికారులు కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఇటు మహరాష్ట్ర ప్రభుత్వం తమ రాజధాని ముంబయి నగరంపై డ్రగ్స్ మాఫియా ముద్ర పడకూడదని విశ్వ ప్రయత్నం చేస్తోంది..ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకనే సుశాంత్ మరణించగానే ఆత్మహత్యగా డిక్లేర్ చేసి.. కామ్ గా ఊరుకున్నారు. దీంతో ప్రజావ్యతిరేకత ఎక్కువ కావడం, బీహార్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడంతో సీబీఐ రంగంలోకి దిగింది. వారికి ఈడీ తోడయ్యింది.
ఎన్సీబీ నుంచి (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) ఎలా ఉండనే ఉంది. వీరందరూ కలిసి సెలబ్రిటీలను నాలుగేసి గంటలకు పైనే విచారిస్తున్నట్టు సమాచారం, అప్పుడే కేంద్ర ప్రభుత్వంపై కూడా వత్తిడులు మొదలైనట్టు సమాచారం. కాకపోతే అక్కడ ఢిల్లీలో కేంద్రప్రభుత్వం, ఇక్కడ శివసేన రెండింటికి పడక పోవడంతో వ్యవహారం అంతర్గత రాజకీయ పోరాటంగా కూడా మారింది. అది బాలీవుడికి శాపంలా మారిందనే చెప్పాలి. అయితే వీళ్ల విభేదాల కారణంగా ప్రజలకు మాత్రం నిజాలు తెలుస్తున్నాయని అందరూ సంతోసం వ్యక్తం చేస్తున్నారు.