Education Department: ఐదుగురు ఎవల్యూవేటర్లను సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ సంచలన నిర్ణయం
ఐదుగురు ఎవల్యూవేటర్లను సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ సంచలన నిర్ణయం
Education Department : పదోతరగతి పరీక్ష జవాబు పత్రాల పునర్ మూల్యాంకనంలో లోటుపాట్లంటూ వచ్చిన వార్తలకు సంబంధించి ఏపీ విద్యాశాఖ(Education Department) శుక్రవారం నాడు కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ వ్యవహారంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవల్యూషన్లో పొరపాట్లు చేసినట్లు గుర్తించింది. పదోతరగతి పేపర్లు దిద్దిన ఐదుగురు ఎవల్యూవేటర్లను సస్పెండ్ చేస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రీవెరిఫికేషన్- 64,251, రీకౌంటింగ్- 2112 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 55,118 పేపర్లు… 24,550 మంది విద్యార్థులకు సంబంధించినవి ఉన్నాయి. మూల్యాంకనంలో నిర్లక్ష్యం వహించినట్లుగా భావించిన 144 పేపర్లు ఒక మార్కు తేడా వచ్చినా కూడా ఎవల్యూవేటర్లు పట్టించుకోకుండా లెక్కించినట్లు అధికారుల పరిశీలనలో తేలింది. మార్కులను వేసే సమయంలో తప్పులు ఎక్కువగా దొర్లినట్లు విద్యాశాఖ(Education Department) గుర్తించింది. రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు జూన్ 1వ తేదీన ఫైనల్ చేస్తామని విద్యాశాఖ వెల్లడించింది. వచ్చే ఏడాది నుంచి ఓఎంఆర్షీట్ డిజైన్లలో స్వల్పమార్పులు చేయాలని పదోతరగతి బోర్డుకు ఏపీ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
Education Department – టెన్త్ మూల్యాంకనంలో చంద్రబాబు సర్కార్ విఫలం – వైసీపీ
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల మూల్యాంకనం ప్రక్రియను సైతం సమర్థంగా నిర్వర్తించలేని దుస్థితిలో విద్యాశాఖ ఉందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నారాయణ కాలేజీల్లో అడ్మీషన్లు పెంచేందుకు మొక్కుబడిగా మూల్యాంకనం నిర్వహించి, ప్రతిభగల విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అసమర్థతతో తన శాఖను నిర్వర్తిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కూటమి పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిపోయింది. హాఫ్ ఇయర్లీ పరీక్షల నుంచి పదో తరగతి పరీక్షల వరకు పేపర్ లీకేజీ జరగకుండా పటిష్టంగా పరీక్షల ప్రక్రియ నిర్వహించలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇటీవల నిర్వహించిన పదో తరగతి వార్షిక పరీక్షల్లోనూ పేపర్ లీక్లతో ప్రభుత్వం అభాసుపాలైంది. ఇదిలా ఉంటే చివరికి పేపర్ మూల్యాంకనంలోనూ ప్రభుత్వ వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.
మార్చి 2025లో పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 1,15,874 మంది ఫెయిలయ్యారు. వారిలో రిలో 66,363 మంది విద్యార్థులు రీకౌంటింగ్, రీ వేల్యూషన్కి దరఖాస్తు చేసుకున్నారు. ఫెయిలైన వారిలో దాదాపు 60 శాతం మంది మా జవాబు పత్రాలను తప్పుల తడకగా మూల్యాంకనం చేశారని దరఖాస్తు చేసుకోవడం ఎస్సెస్సీ బోర్డు చరిత్రలో ఇదే ప్రథమం. రీవేల్యూషన్, రీకౌంటింగ్ తర్వాత దాదాపు 11 వేల మంది ఉత్తీర్ణులైనట్టు ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది. ఇదంతా చూస్తుంటే మూల్యాంకన విధానం ఎంత లోపభూయిష్టంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
లోకేష్ అసమర్థతకు టీచర్లు బలి – వైసీపీ
రాష్ట్ర చరిత్రలో 22 రోజుల్లోనే పేపర్ మూల్యాంకనం పూర్తి చేశామని కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. తీరా ఫలితాలు చూశాక విద్యార్థుల తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. తప్పుడు తడకలుగా మూల్యాంకనం చేసి 1,15,874 మంది విద్యార్థులు ఫెయిలైనట్లు ఫలితాలు ప్రకటించారు. రీవేల్యూషన్ లో 66వేల మందికిపైగా విద్యార్థులు పాసవ్వడంతో ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేని దుస్థితిలోకి వెళ్లిపోయింది. మూల్యాంకనంలో టీచర్లకు టార్గెట్లు పెట్టి వేధించి విద్యార్థుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆడుకునే పరిస్థితి తీసుకొచ్చింది.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు టీచర్లను దోషులుగా చూపించి సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకోవడం దుర్మార్గం. నారాయణ కాలేజీలో అడ్మిషన్లు పెంచుకునే వ్యూహంలో భాగంగానే హడావుడిగా మూల్యాంకనం చేయించినట్టుగా తెలుస్తోంది. చివరికి మూల్యాంకనంలో లోపాలు తలెత్తడంతో టీచర్లను బలిచేశారు. విద్యావ్యవస్థపై కనీస అవగాహన లేకుండా, పర్యవేక్షణ చేయకుండా విద్యార్థుల జీవితాలతో లోకేష్ ఆడుకుంటున్నాడు. మూల్యాంకనంలో జరిగిన తప్పులకు, లోపాలకు మంత్రి లోకేష్ బాధ్యత వహించాలి.
Also Read : CM Chandrababu : భారత్ కు మోదీ నాయకత్వం ప్రధాన బలం
