Encounter: గడ్చిరోలిలో ఎన్కౌంటర్ ! నలుగురు మావోయిస్టులు మృతి !
గడ్చిరోలిలో ఎన్కౌంటర్ ! నలుగురు మావోయిస్టులు మృతి !
Encounter : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. మరోవైపు భమ్రాగఢ్ లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కాగా, రెండు రోజుల క్రితం ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో(Encounter) మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్, జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు (71) మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు కీలక నేతలు సహా మొత్తం 27 మంది మావోయిస్టులు కూడా మరణించారు. ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్–బీజాపూర్ జిల్లా సరిహద్దు అబూ జ్మఢ్ అడవుల్లో ఇంద్రావతి నది పరీవాహక ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ డీఆర్జీ జవాను కూడా మృతి చెందాడు.
Encounter in Gadchiroli
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీస్ స్పెషల్ కమాండో యూనిట్ సీ-60, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా గడ్చిరోలి జిల్లాలో ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. కవండే ప్రాంతంలో ఇటీవల ప్రారంభించిన ఫార్వార్డ్ ఆపరేటింగ్ బేస్ (ఎఫ్వోబీ) సమీపంలో మావోయిస్టులు ఉన్నట్లు అందిన సమాచారం ఆధారంగా గురువారం మధ్యాహ్నం ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. భారీ వర్షం మధ్య దాదాపు 300 మంది సీ-60 కమాండోలు, సీఆర్పీఎఫ్ సిబ్బంది ఆపరేషన్ నిర్వహించారని… ఈ క్రమంలో శుక్రవారం ఉదయం మావోయిస్టులు కాల్పులు జరపడంతో భద్రతా దళాలు సమర్థమంతంగా తిప్పికొట్టాయని పేర్కొన్నారు. దాదాపు రెండు గంటల పాటు కాల్పుల అనంతరం భద్రతాదళాలు గాలించగా నలుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో కొన్ని తుపాకులు, వాకీటాకీ, నక్సల్ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read : YS Jagan: ‘చంద్రబాబు సర్కార్’పై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్