Ahmedabad Plane Crash: నిపుణులకు సైతం అంతుపట్టని ఎయిర్ ఇండియా ప్రమాదం ! అసలేం జరిగింది ?

నిపుణులకు సైతం అంతుపట్టని ఎయిర్ ఇండియా ప్రమాదం ! అసలేం జరిగింది ?

Ahmedabad Plane Crash : అహ్మదాబాద్‌ లో బోయింగ్‌ 787 విమానం కూలిన ఘటనపై నిపుణులు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అలాగే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టేకాఫ్‌ అయిన వెంటనే కూలిపోవడానికి గల కారణాలు అంతుచిక్కడం లేదని అంటున్నారు. అయితే మాజీ పైలట్‌ ఎహసాన్‌ ఖలీద్‌ మాత్రం విమానం ల్యాండింగ్‌ గేర్‌ కిందకు ఉండడంపై అనుమానం వ్యక్తం చేశారు. పైలట్‌ ఏటీసీకి ‘మేడే’ కాల్‌ ఇచ్చారంటే విమానంలో వ్యవస్థ విఫలమైందని అర్థమన్నారు.

Ahmedabad Plane Crash Updates

‘‘ల్యాండింగ్‌ గేర్‌ ఎందుకు కిందకు ఉందో అర్థం కావడం లేదు. విమానం గాల్లోకి లేచిన వెంటనే ల్యాండింగ్‌ గేర్‌ లోపలికి వెళ్లిపోతుంది. కూలిన విమానం ల్యాండింగ్‌ గేర్‌ కిందకు ఉందంటే ఇంజన్‌ విఫలమైనట్లు గుర్తించాలి. ప్రమాదానికి ఇలాంటి ఎన్నో అంశాలు కారణమై ఉంటాయి. అయితే ల్యాండింగ్‌ గేర్‌ ఎందుకు కిందకు ఉందన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. విమానం కూలడానికి కారణం ఏంటన్నది ఇప్పుడే ఎవరూ చెప్పలేరు’’ అని ఖలీద్‌ అన్నారు.

విమానం శక్తిని కోల్పోయినట్లు కనిపించిందని, దానికి ఇంజన్‌లో లోపం కూడా కారణమై ఉండొచ్చని తెలిపారు. అయితే ఒకేసారి రెండు ఇంజన్లు విఫలమయ్యే అవకాశం ఉండదన్నారు. అంత తక్కువ సమయంలో పక్షి ఢీకొనడం వల్ల ఇంజన్లు ఫెయిలయ్యే చాన్స్‌ కూడా ఉండదని చెప్పారు. అమెరికా ఏరోస్పేస్‌ సేఫ్టీ కన్సల్టెంట్‌ ఆంటోనీ బ్రిక్‌హౌస్‌ కూడా ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తం చేశారు. టేకాఫ్‌ అయిన విమానానికి ల్యాండింగ్‌ గేర్‌ ఆ స్థితిలో ఉండడం అసహజంగా అనిపిస్తోందన్నారు. కూలిపోయే ముందు ఆ విమానాన్ని చూస్తే రన్‌వే వైపు వెళ్తున్నట్లుగా అనిపించిందని చెప్పారు.

ప్రమాదంపై సందేహాలు వ్యక్తం చేస్తున్న అమెరికా నిపుణులు

అహ్మదాబాద్‌ విమాన ప్రమాద (Ahmedabad Plane Crash) ఘటనపై అమెరికా(America) నిపుణులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు విమానం ప్రయాణానికి పూర్తిగా సిద్ధంగా ఉందా? అన్నది కూడా తేలాల్సి ఉందని అంటున్నారు. ఏవియేషన్‌ సేఫ్టీ కన్సల్టెంట్‌ జాన్‌ ఎం కాక్స్‌ మాట్లాడుతూ… ఎయిరిండియాకు (Air India) చెందిన బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ విమానాన్ని ప్రయాణానికి పూర్తిస్థాయిలో సన్నద్ధం చేశారా? అన్నది విచారణ అధికారులు తేల్చాల్సి ఉందని చెప్పారు. విమాన రెక్కలకు ఉండే స్లాట్‌లు, ఫ్లాప్‌లు సరైన స్థితిలోనే ఉన్నాయా? విమానం ఎగిరేందుకు అనువుగా ఉన్నాయా? అన్న అంశంపైనా దర్యాప్తు చేయాలన్నారు. విమానం ఫొటోలు చూస్తుంటే ఈ అనుమానం కలుగుతోందని చెప్పారు. విమానాలను నడపడంలో టేకాఫ్‌, ల్యాండింగే అత్యంత ప్రమాదకరమైన దశలని మరో నిపుణుడు వ్యాఖ్యానించారు. విమానాలు 200 మీటర్లు లేదా 650 అడుగులకు పైగా ఎత్తుకు చేరుకోలేనప్పుడు పైలట్లు ఆలస్యమైనా సరే టేకాఫ్ ను ఆపేస్తారని తెలిపారు. కానీ, ఈ ప్రమాద ఘటనలో టేకాఫ్‌ చివరి దశలో ఉండగా హఠాత్తుగా సమస్య ఉత్పన్నమై ఉంటుందని చెప్పారు.

ఇంజన్ల విఫలం లేదా పక్షి ఢీకొట్టడం ?

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదానికి (Ahmedabad Plane Crash) కారణం ఇంజన్లు విఫలమవడం లేదా పక్షి ఢీకొట్టడం అయి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. విమానం కూలిన వీడియోలు చూస్తుంటే టేకాఫ్ కు అవసరమైన శక్తిని అందించడంలో ఇంజన్లు విఫలమైనట్లు కనిపిస్తోందని ముగ్గురు సీనియర్‌ వైడ్‌ బాడీ పైలట్లు అభిప్రాయపడ్డారు. ఒక ఇంజన్‌ విఫలమైనట్లు కనిపించడం లేదని, అలా అయి ఉంటే విమానం ఊగిపోతుందని ఓ పైలట్‌ పేర్కొన్నారు. కానీ, ఈ ఘటనలో విమానం స్థిరంగానే ఉందన్నారు. అంటే రెండు ఇంజన్లూ విఫలమై ఉంటాయని, రెండు ఇంజన్లలోనూ థ్రస్ట్‌ కోల్పోయి ఉండొచ్చని మరో కమాండర్‌ పేర్కొన్నారు. పక్షులు ఢీకొనడం వల్ల కూడా రెండు ఇంజన్లలో మంటలు చెలరేగి ఉండొచ్చని అన్నారు. కాగా, విమానం రెండు ఇంజన్లు శక్తిని కోల్పోయి ఉంటాయని మూడో పైలట్‌ చెప్పారు. ఒక ఇంజన్‌ విఫలమై ఉంటుందని, ల్యాండింగ్‌ గేర్‌ పైకి రాకపోవడంతో రెండో ఇంజన్‌ కూడా సరిపడా శక్తిని ఉత్పత్తి చేయలేకపోయి ఉంటుందని తెలిపారు.

Also Read : May Day: విమాన ప్రమాదం గుట్టు విప్పనున్న బ్లాక్ బాక్స్, ‘మే డే కాల్’ ?

Leave A Reply

Your Email Id will not be published!