Nuzivid IIIT: నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఫుడ్ పాయిజనింగ్ ! వెయ్యిమంది విద్యార్థులకు అస్వస్థత !

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఫుడ్ పాయిజనింగ్ ! వెయ్యిమంది విద్యార్థులకు అస్వస్థత !

Nuzivid IIIT: అపరిశుభ్ర వాతావరణం… నాసిరకం ఆహారం వికటించి నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో గత వారం నుంచి వందలమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో ఆసుపత్రికి వరుస కడుతున్నారు. విద్యార్థులు అనారోగ్యంతో అల్లాడిపోతున్న విషయం బయటకు రాకుండా యాజమాన్యం జాగ్రత్తపడింది. నూజివీడు ట్రిపుల్‌ ఐటీ(Nuzivid IIIT) ప్రాంగణంలోనే నిర్వహిస్తున్న శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ కు సంబంధించిన విద్యార్ధులు కూడా ఈనెల 23 నుంచి అస్వస్థతకు గురికావడం మొదలైంది. ప్రధానంగా మూడు మెస్‌ లలో ఆహారం తిన్న విద్యార్థుల్లో చాలామంది అనారోగ్యం పాలయ్యారు. నాలుగు రోజులుగా తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఆదివారం 165, సోమవారం 229, మంగళవారం 345, బుధవారం మొదటి షిఫ్ట్‌లోనే 131 మంది ఆసుపత్రిలో చికిత్స పొందారు. వెయ్యిమందికి పైగా అనారోగ్యం పాలైతే 400 మంది మాత్రమే అన్నట్లు లెక్కలు చూపిస్తున్నారు. ఆసుపత్రికి వెళ్లిన వారిలో ఎక్కువమంది పేర్లు ఓపీలో నమోదు చేయకుండా రోగుల సంఖ్య తగ్గించే ప్రయత్నం చేశారు.

అయితే ట్రిపుల్ ఐటీల్లో(Nuzivid IIIT) ఫుడ్ పాయిజనింగ్ కు అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మెస్‌లోని వంటశాలల్లో పరిశుభ్రతకు నిర్వాహకులు నీళ్లొదిలారు. వంట పాత్రలు, విద్యార్థులు తినే కంచాలను సరిగా శుభ్రం చేయడం లేదు. గ్రైండర్లు కడగకుండానే వినియోగిస్తున్నారు. వంటశాలలు కనీసం ఊడ్చే పరిస్థితి లేదు. ఆహార పదార్థాల నాణ్యతను ఏళ్ల నుంచి పట్టించుకోవటం లేదు. పులిసిపోయిన పిండి కలిపిన పెరుగు విద్యార్థులకు వడ్డిస్తున్నారు. చపాతీల్లో మైదా పిండి కలపడంతోపాటు పూర్తిగా కాల్చకుండానే పిల్లలకు పెడుతున్నారు. నీళ్ల సాంబారు సంగతి చెప్పనక్కరలేదు. దీనితోనే తాము అనారోగ్యానికి గురవుతున్నమని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.

Nuzivid IIIT – ఫుడ్ పాయిజనింగ్ పై మంత్రి లోకేష్ ఆరా !

ట్రిపుల్ ఐటీ(Nuzivid IIIT)లో ఫుడ్ పాయిజనింగ్ విషయం తెలిసిన వెంటనే మంత్రి లోకేశ్‌ వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. ‘విద్యార్థుల అస్వస్థత వార్త ఆందోళనకు గురిచేసింది. వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు.. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి’ అంటూ ఎక్స్‌లో తెలిపారు. దీనితో అధికారులు స్పందించారు. డీఎంహెచ్‌వో షర్మిష్ఠ ట్రిపుల్‌ ఐటీ మెస్‌లు, ఆసుపత్రిని సందర్శించారు. పరిశుభ్రత, ఆహార నాణ్యత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని తెలిపారు.

ఫుడ్‌ కోర్టులో నిల్వ పదార్థాలపై మంత్రి కొలుసు ఆగ్రహం

విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి బుధవారం నూజివీడు ట్రిపుల్‌ ఐటీని సందర్శించారు. ముందుగా ప్రాంగణంలో ఉన్న ఫుడ్‌కోర్టును పరిశీలించారు. నిల్వ మాంసం, బూజు పట్టిన ఆహార పదార్థాలు గుర్తించి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ పిల్లలకు ఇలాంటి ఆహారమే పెడతారా’ అంటూ మండిపడ్డారు. ఘటనపై విచారణ చేసి నివేదిక అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. దీనిపై ఆయన రిజిస్ట్రార్‌తో మాట్లాడి అనారోగ్యానికి కారణాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు అందుతున్న వైద్యంపై నిరంతరం పర్యవేక్షించాలని ఏలూరు జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.

Also Read : Zaheerabad: జహీరాబాద్‌ లో పారిశ్రామిక నగరం కేంద్ర మంత్రి వర్గం ఆమోదం !

Leave A Reply

Your Email Id will not be published!