Former Fibernet MD Madhusudan Reddy: ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు !
ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు !
Former Fibernet MD: ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ మాజీ ఎండీ() మధుసూదన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ సోమవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులను ఉద్యోగుల నియామకం చేశారని మధుసూదన్ రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత మధుసూదన్ రెడ్డి రికార్డులను ట్యాంపర్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం మధుసూదన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేస్తూ… సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నారని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. మధుసూధన్ రెడ్డి కేంద్ర సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించినట్టు పేర్కొన్న ప్రభుత్వం.. హెడ్ క్వార్టర్సు విడిచి వెళ్లకూడదని స్పష్టం చేస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని మధుసూదన్ రెడ్డి మీద అభియోగాలు నమోదు అయ్యాయి.
వైసీపీ ప్రభుత్వ హయాలంలో ఏపీ ఫైబర్ నెట్(AP Fiber Net) కార్పోరేషనులో రూ. 800 కోట్ల మేర అవినీతి జరిగిందని ఏపీ సర్కార్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఫైబర్ నెట్ లో అక్రమాలతో ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిలినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఫైబర్ నెట్ లో జరిగిన అక్రమాలపై పూర్తి విచారణకు ఆదేశించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
Former Fibernet MD- రైల్వే బోర్డు ఛైర్మన్ కు ఏపీ ప్రభుత్వం లేఖ
ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిపై విచారణలో భాగంగా రైల్వే బోర్డు ఛైర్మన్కు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఫైబర్నెట్లో అక్రమాలపై విచారణ దృష్ట్యా డిప్యుటేషన్ను 6 నెలలపాటు పొడిగించాలని కోరింది. ఆగస్టు 22తో ఏపీలో మధుసూదన్ రెడ్డి డిప్యూటేషన్ ముగియనుంది. 2019 ఆగస్టు 26న రైల్వే అకౌంట్స్ సర్వీసు నుంచి ఆయన డిప్యుటేషన్ పై రాష్ట్రానికి వచ్చారు.
Also Read : Food Poisoning: అనకాపల్లి జిల్లాలో కలుషితాహారం తిని ముగ్గురు విద్యార్థుల మృతి !