Banakacherla Project: త్వరలో బనకచర్ల ప్రాజెక్టుకు టెండర్ల ఆహ్వానం – సీఎం చంద్రబాబు
త్వరలో బనకచర్ల ప్రాజెక్టుకు టెండర్ల ఆహ్వానం - సీఎం చంద్రబాబు
Banakacherla Project : జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్పై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో పోలవరం – బనకచర్లకు టెండర్లు ఆహ్వానిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అటవీ – పర్యావరణ అనుమతులు, డీపీఆర్ ఆమోదం తదితర అంశాలన్నీ అనుకున్న సమయానికి జరగాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆదేశించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణకు సైతం సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో పోలవరం – బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టాలని ఉన్నతాధికారులకు ఆయన వివరించారు. శుక్రవారం రాజధాని అమరావతిలోని సచివాలయంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడుతోపాటు(Minister Nimmala Ramanaidu) ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.
Banakacherla Project Updates
బనకచర్ల ప్రాజెక్టు(Banakacherla Project) టెండర్లకు సంబంధించిన రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీతో డ్రాఫ్ట్ డాక్యుమెంట్ రూపొందించడం, సాంకేతిక నిపుణుల పర్యవేక్షణ అనంతరం టెండర్లు పిలవడం వంటి అంశాలన్నీ జూన్ మాసాంతానికి పూర్తి కావాలని ఆ శాఖ ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జల హారతి కార్పొరేషన్ కింద పోలవరం – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుండగా… దీని కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీపీ) ఇప్పటికే ఏర్పాటు చేశామన్నారు.
ప్రాజెక్టు నిర్మాణం నేపథ్యంలో ఆర్ధిక వనరుల సమీకరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఏపీ ప్రతిపాదనలు పంపించిందన్నారు. మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.81,900 కోట్ల వ్యయం అవుతుందన్నారు. అందులో 50 శాతం అంటే రూ.40,950 ఈఏపీ రుణంగా పొందాలని నిర్ణయించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ గ్రాంట్గా 20 శాతం నిధులు రూ.16,380 కోట్లు సమకూర్చుకోవాలని.. రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీగా 10 శాతం నిధులు రూ.8,190 కోట్లు.. హ్యామ్ విధానంలో మరో 20 శాతం నిధులు రూ.16,380 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి కావాలని ఆయన ఆదేశించారు.
కృష్ణా – గోదావరి డెల్టాకు తక్షణమే నీరు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆదేశించారు. తుపాన్ల ముప్పు తప్పేలా పంట కాలం ముందుకు జరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 365 రోజులు భూమి పచ్చగా ఉండేలా.. అందుకోసం 3 పంటలు నిరంతరం పండించేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. బుడమేరులో పూడిక తొలగించాలని.. ఆ క్రమంలో వాగులో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా పూడిక తీత, ముళ్ల కంపలు తొలగించాలని సూచించారు. శాస్త్రీయంగా వాటర్ ఆడిటింగ్ – వాటర్ మేనేజ్మెంట్ జరగాలన్నారు. పిజియో మీటర్లు, సెన్సర్లు కొనుగోలుకు రూ.30 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. భూగర్భ జలాలు పెంచడం, రిజర్వాయర్లు నింపడం, జల వనరుల సమర్ధ వినియోగం జరిగేలా చూడాలన్నారు. ప్రధానంగా ఈ 3 అంశాలపై దృష్టి సారించాలని ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. భూగర్భ జలాల వివరాలతో బులిటెన్లు విడుదల చేయాల్సి ఉందన్నారు. సీలేరు నీటిని కృష్ణా డెల్టాకు వినియోగించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఇక హంద్రీ – నీవా మెయిన్ కెనాల్ వైడనింగ్ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.
వెలిగొండ స్టేజ్ వన్ పనులు 2026 జూన్ నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ఆర్ధిక సాయం కోసం సాస్కిలో పెట్టండన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్ మరమ్మతులకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఒక్క ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసినా.. ఆ నీటితో మూడునాలుగేళ్లు కరువొచ్చినా వాటర్ మేనేజ్మెంట్ జరగాలని ఆయన ఆకాంక్షించారు. క్రాప్ ప్యాట్రన్ మార్చి.. తడి- ఆరుతడి పంటల సాగుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. జల సంరక్షణ కోసం వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు నిర్మించాలని అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు.
Also Read : Mega DSC: ఒకే తేదీల్లో తెలంగాణ టెట్, ఏపీ డీఎస్సీ ! ఇరకాటంలో అభ్యర్థులు !
