HCU: హెచ్‌సీయూ నుండి పోలీసు బలగాల ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయం

హెచ్‌సీయూ నుండి పోలీసు బలగాల ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయం

 

కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై… హెచ్‌సీయూ వేదికగా విద్యార్ధులు, విద్యార్ధి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భూముల వ్యవహారంపై సుప్రీకోర్టు స్టే విధించడంతో… హెచ్‌సీయూ విద్యార్ధులు తాత్కాలికంగా ఆందోళనను విరమించారు. ఈ నేపథ్యంలో హెచ్‌సీయూ కంచ గచ్చిబౌలి సమస్యపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సోమవారం సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు ప్రొఫెసర్ సౌమ్య దేచమ్మ సీసీ, ప్రొఫెసర్ శ్రీపర్ణ దాస్, ప్రొఫెసర్ భంగ్యా భూక్య, పౌర సంఘాల ప్రతినిధులు విస్సా కిరణ్‌కుమార్, ఎన్ఏపీఎం, వి.సంధ్య, డబ్ల్యూటీజేఏసీ కే. సజయ, డబ్ల్యూటీజేఏసీ, ఇమ్రాన్ సిద్ధిఖీ, సీడబ్ల్యూఎస్ ఇండియా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్‌సీయూలో మోహరించిన పోలీసు బలగాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ మంత్రుల బృందానికి వారు వినతిపత్రం సమర్పించారు.

దీనితో హెచ్‌సీయూ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు చేసిన విజ్ఞప్తిపై మంత్రుల సబ్ కమిటీ సానుకూలంగా స్పందించింది. సబ్ కమిటీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హెచ్‌సీయూ విద్యార్థులు అధ్యాపకులు, రిజిస్టార్ గతంలో చేసిన విజ్ఞప్తిని క్రోడీకరిస్తూ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌కు లేఖ రాశారు. హెచ్‌సీయూ స్వయం ప్రతిపత్తి, బోధన, పరిశోధనలకు సురక్షితంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వానికి అచంచల విశ్వాసం ఉందని పునరుద్ఘాటిస్తున్నామని అన్నారు. ఏప్రిల్ 2న యూనివర్సిటీలో శాంతి భద్రతలు, విద్యార్థులు అధ్యాపకుల భద్రతకు క్యాంపస్‌ లో పోలీసులను అందుబాటులో ఉంచాల్సిందిగా హెచ్‌సీయూ రిజిస్ట్రార్ కోరారని మల్లు భట్టి విక్రమార్క గుర్తుచేశారు.

 

ఆ మేరకు గతంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. ఉపాధ్యాయ జేఏసీ, పౌర సంఘం సభ్యుల విజ్ఞప్తికి స్పందించి కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను మినహాయించి మెయిన్ క్యాంపస్ సమీపంలో పోలీస్ బందోబస్తును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా 400 ఎకరాలు ఉన్న కంచ గచ్చిబౌలిలో చెట్ల సంరక్షణ తప్ప ఏ ఇతర కార్యకలాపాలకు అనుమతించబోమని మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

క్యాంపస్‌లో కార్యకలాపాలు శాంతియుతంగా జరిగేలా హెచ్‌సీయూ సొంత సెక్యూరిటీ ఏర్పాటు చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు. హెచ్‌సీయూ నుంచి లిఖిత పూర్వకంగా హామీ వచ్చిన తర్వాత పోలీసులను ఉపసంహరిస్తామని తెలిపారు. ప్రభుత్వ౦ హెచ్‌సీయూకి సంబంధించిన అంశంలో అందరితోనూ చర్చలకు ఎల్లవేళలా సిద్ధంగా ఉందని ప్రభుత్వ పక్షాన హెచ్‌సీయూ అధికారులు హామీ ఇవ్వాలని అన్నారు. విద్య, నైపుణ్యం సామాజిక బాధ్యత సాధించడంలో యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచి పని చేయడానికి సదా సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లేఖలో పేర్కొన్నారు.

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్‌

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నకిలీ వీడియోలు సృష్టించి ప్రచారం చేశారని పిటిషన్‌ లో పేర్కొంది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది మేనక గురుస్వామి వాదనలు వినిపించారు. మొత్తం 400 ఎకరాలకు సంబంధించిన నకిలీ వీడియోలు, ఆడియో క్లిప్పింగ్స్‌ తయారు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భూమిని చదును చేసే క్రమంలో బుల్డోజర్లను చూసి జింకలు, నెమళ్లు పారిపోతున్నట్లు నకిలీ వీడియోలు సృష్టించారని పిటిషన్‌లో పేర్కొంది. నకిలీ వీడియోలు సృష్టించిన వారిపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. అయితే పిటిషన్ ‌పై ఏప్రిల్‌ 24న వాదనలు వింటామని హైకోర్టు వెల్లడించింది.

Leave A Reply

Your Email Id will not be published!