Hydra: కూకట్పల్లి, మియాపూర్ లో హైడ్రా కూల్చివేతలు
కూకట్పల్లి, మియాపూర్ లో హైడ్రా కూల్చివేతలు
తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. తాజాగా మియాపూర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. హెచ్ఎండీఏ లేఅవుట్లోని అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
మియాపూర్ లోని హైదర్నగర్లో సోమవారం ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. తప్పుడు పత్రాలతో తమ భూమి కబ్జా చేశారని ఇటీవల 70 మంది ప్లాట్ల యజమానులు ఫిర్యాదు చేశారు. దీనితో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. హెచ్ఎండీఏ లేఅవుట్లోని అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. హైకోర్టు ఆదేశాలతోనే అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు. ఇక, కబ్జాదారుల నుంచి భూములు విడిపించడంపై ప్లాట్ల యజమానులు హర్షం వ్యక్తం చేశారు.
కూకట్పల్లిలో ఆక్రమణలను కూల్చేసిన హైడ్రా
కూకట్పల్లి పరిధి హైదర్నగర్లోని డైమండ్ ఎస్టేట్ లేఅవుట్ను ఆక్రమణదారుల చెర నుంచి హైడ్రా విడిపించింది. ఇక్కడ ప్లాట్లను కొనుగోలు చేసిన 79 మంది బాధితులకు న్యాయం చేసింది. గత సంవత్సరం సెప్టెంబర్లో 79 మంది బాధితులకు ఈ స్థలం చెందుతుందని హైకోర్టు తీర్పునిచ్చింది. అయినా కబ్జాదారులు స్థలాన్ని ఖాళీ చేయకపోవడంతో బాధితులంతా హైడ్రాకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
కూకట్పల్లి మండలం హైదర్నగర్ డివిజన్లోని సర్వే నెంబర్ 145లో 9 ఎకరాల 27 గుంటల స్థలంలో డైమండ్ ఎస్టేట్స్ లేఅవుట్ విస్తరించింది. ఇందులో మధ్యతరగతి ప్రజలు 79 మంది 2000 సంవత్సరంలో ప్లాట్లు కొనుగోలు చేశారు. అనంతరం ఆ స్థలం తనదని శివ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మరి కొంతమందితో కలిసి ఆక్రమణకు పాల్పడ్డాడు. అనంతరం ప్లాట్ల యజమానులను స్థలంలోకి రాకుండా హైకోర్టు నుంచి స్టే తీసుకువచ్చారు.
దీనితో బాధితులందరూ కోర్టుకు వెళ్లి 2024 సెప్టెంబర్లో స్థలాలను దక్కించుకున్నారు. న్యాయస్థానం ప్లాట్ల యజమానులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా కబ్జాదారులు స్థలాన్ని ఖాళీ చేయలేదు. బాధితులను లేఅవుట్లోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో వారంతా హైడ్రాకు ప్రజావాణిలో గోడును వెలిబుచ్చారు. ఈక్రమంలో హైడ్రా సోమవారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల తొలగింపు చేపట్టింది. దీంతో ప్లాట్ల యజమానులు హర్షం వ్యక్తం చేస్తూ హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.