INDIA Bloc: ఎగ్జిట్‌ పోల్స్‌ పై వెనక్కి తగ్గిన ‘ఇండియా’ కూటమి !

ఎగ్జిట్‌ పోల్స్‌ పై వెనక్కి తగ్గిన ‘ఇండియా’ కూటమి !

INDIA Bloc: సార్వత్రిక ఎన్నికలపై వెలువడనున్న ఎగ్జిట్‌ పోల్స్‌ పై టీవీ ఛానళ్ల చర్చల్లో పాల్గొన కూడదని తీసుకున్న నిర్ణయంపై ‘ఇండియా’ కూటమికి చెందిన పార్టీలు వెనక్కి తగ్గాయి. ఓటరు తన తీర్పును ఈవీఎంలో భద్రపరచిన తరువాత… ఎగ్జిట్ పోల్స్ పేరుతో ఎన్ని చర్చలు పెట్టినా ఆ నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరని… అలాంటప్పుడు టీఆర్‌పీ రేటింగ్‌ల కోసం ఊహగానాలను ప్రచారం చేయడం ఎందుకని ఎగ్జిట్ పోల్స్ డిబేట్స్ కు ఇండియా కూటమి(INDIA Bloc) దూరంగా ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, మీడియా వ్యవహారాల ఛైర్‌పర్సన్‌ పవన్‌ ఖేరా ప్రకటించారు. అయితే ఆయన నిర్ణయం ప్రకటించి 24 గంటలు తిరగకముందే… ‘ఇండియా’ కూటమి తన నిర్ణయంపై వెనక్కి తగ్గింది. శనివారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమైన ‘ఇండియా కూటమి’ సీనియర్‌ నేతలు తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

INDIA Bloc..

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమైన ‘ఇండియా కూటమి’ సీనియర్‌ నేతలు… జూన్‌ 4న ఓట్ల లెక్కింపు వేళ అనుసరించాల్సిన వ్యూహాలు, కౌంటింగ్ సన్నాహాలు, భవిష్యత్తు కార్యాచరణపైనా ఈ సందర్భంగా చర్చించినట్లు తెలుస్తోంది. ‘‘ఓట్ల లెక్కింపు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ‘ఇండియా’ కూటమి నేతలంతా అనధికారికంగా సమావేశమయ్యాం. పోరు ఇంకా ముగియలేదు. ఫారం 17సీ, ఈవీఎంల విషయంలో కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. శక్తివంచన లేకుండా మేమంతా లోక్‌సభ ఎన్నికల్లో పోరాడాం. ప్రజలు మాకు మద్దతు ఇచ్చారని భావిస్తున్నాం. సానుకూల ఫలితాలు వస్తాయన్న విశ్వాసంతో ఉన్నాం’’ అని ఖర్గే ట్వీట్‌ చేశారు. ఈ ఎన్నికల్లో తమ కూటమికి 295కుపైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌, శరద్‌ పవార్‌, అఖిలేశ్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌, అనిల్‌ దేశాయ్‌, సీతారామ్‌ ఏచూరీ, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌, సంజయ్‌ సింగ్‌, రాఘవ్‌ చడ్ఢా, కల్పనా సోరెన్‌, చంపయి సోరెన్‌, టీఆర్‌ బాలు, ఫారుక్‌ అబ్దుల్లా, డి.రాజా, ముకేశ్‌ సహానీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో చివరి దశ పోలింగ్‌ నేపథ్యంలో సమావేశానికి హాజరుకాలేనని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే సమాచారం అందించారు. వ్యక్తిగత కారణాలతో పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ కూడా హాజరుకాలేదు.

Also Read : Bandi Sanjay : ప్రభుత్వం తీసుకునే ఆ నిర్ణయం మంచిదే అంటున్న బండి

Leave A Reply

Your Email Id will not be published!