India Delegation: పాక్‌ తో ఇక చర్చలుండవ్‌ – అమెరికాలో పార్లమెంటరీ ప్రతినిధుల బృందం

పాక్‌ తో ఇక చర్చలుండవ్‌ - అమెరికాలో పార్లమెంటరీ ప్రతినిధుల బృందం

 

 

తలపై తుపాకీ గురిపెట్టిన పాకిస్థాన్‌తో చర్చలు ఉండబోవని అమెరికాలో పర్యటిస్తున్న పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ స్పష్టం చేశారు. తన భూభాగంలోని ఉగ్రవాద శక్తులను ఆ దేశం నియంత్రించకపోతే… భారత్‌ ఇప్పటిలాగే మళ్లీ దాడులు చేస్తుందని హెచ్చరించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌ లోని క్యాపిటల్‌ హిల్‌ లో పలువురు ప్రజాప్రతినిధులతో భారత బృందం భేటీ అయిన అనంతరం నేషనల్‌ ప్రెస్‌ క్లబ్‌లో థరూర్‌ మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ‘పాక్‌ పై భారత్‌ కు స్పష్టమైన వైఖరి ఉందని అమెరికా అర్థం చేసుకుందని నేను భావిస్తున్నా. పాక్‌ తో భారత్‌ చర్చలు జరపదని కాదు. తలపై తుపాకీ గురిపెట్టి మాట్లాడే వ్యక్తులతో మేము సంభాషించం. అమెరికా అధ్యక్ష పదవిపై భారత దేశానికి అపారమైన గౌరవం ఉంది. కానీ ఢిల్లీ ఎప్పుడూ ప్రత్యేకంగా ఆపరేషన్‌ సిందూర్‌ విషయంలో ఎవరినీ మధ్యవర్తిత్వం చేయాలని కోరలేదు. ఎవరూ యుద్ధం ఆపాలని చెప్పాల్సిన అవసరం లేదు. పాక్‌ ఉగ్రవాద భాషను ఉపయోగించినంత కాలం… మేము బల ప్రయోగ భాషను ఉపయోగిస్తాం. కాల్పుల విరమణ కోసం మూడో పక్షం మధ్యవర్తిత్వం అవసరం లేదు’ అని థరూర్‌ స్పష్టం చేశారు.

పాకిస్థాన్‌ నేత బిలావల్‌ భుట్టో అమెరికాలో శాంతి వచనాలు పలకడంపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి నోటి నుంచి శాంతి వచనాలు రావడం చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని ఎద్దేవా చేశారు. థరూర్‌తోపాటు ఆయన కూడా మీడియాతో మాట్లాడారు. ‘నకిలీ హీరోలను తయారు చేసేందుకు పాకిస్థాన్‌ ప్రయత్నిస్తోంది. యుద్ధంలో విఫలమైన వారికి ఫీల్డ్‌ మార్షల్‌గా పదోన్నతి కల్పించింది. వారికి నిజమైన హీరోలు ఎలా ఉంటారో తెలియదు. చైనాకు చెందిన చౌకైనా ఆయుధాలతో పాక్‌ నెట్టుకొస్తోంది. కాబట్టి మా దేశంలోని అత్యాధునిక ఆయుధాలు, మా బలగాలు, బలమైన ప్రజాస్వామ్య నాయకత్వాన్ని జీర్ణించుకోవడం వారికి కష్టమే’ అని సూర్య పేర్కొన్నారు.

జేడీ వాన్స్‌తో పార్లమెంటరీ ప్రతినిధుల బృందం భేటీ

అమెరికాలో పర్యటిస్తున్న భారత ప్రతినిధి బృందం… గురువారం ఉపాధ్యక్షుడు జేడా వాన్స్‌తో భేటీ అయింది. ఆయనతో సమగ్ర చర్చలు జరిపింది. ఉగ్రవాదం, సాంకేతిక సహకారంపై వారి మధ్య చర్చలు జరిగాయి. అంతకుముందు బుధవారం క్యాపిటల్‌ హిల్‌లో పలువురు అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు, సెనేటర్లను భారత ప్రతినిధి బృందం కలిసింది. వారంతా ఉగ్రవాదంపై భారత పోరాటానికి సంఘీభావం తెలిపారని థరూర్‌ వెల్లడించారు.

 

బీజేపీ ఎంపీ రవిశంకర్‌ ప్రసాద్‌ నేతృత్వంలోని బృందం… బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో ఐరోపా కూటమి (ఈయూ) నేతలతో భేటీ అయింది. యూరోపియన్‌ పార్లమెంటు ఆసియా ఇన్‌ఛార్జ్‌ ఉపాధ్యక్షుడు క్రిస్టెల్‌ షాల్డెమోస్‌ను కలిసిన బృందం.. ఆపరేషన్‌ సిందూర్, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌ తీరు గురించి వివరించారు. ఈయూ పార్లమెంటు సభ్యులు, ప్రవాస భారతీయులతోనూ బృందం భేటీ అయింది.

 

కుమారుడి ప్రశ్నకు తండ్రి శశి థరూర్‌ ధీటైన సమాధానం

విదేశీ వ్యవహారాల కౌన్సిల్‌లో జరిగిన ముఖాముఖిలో ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు. అయితే థరూర్‌ కు ఈ ప్రశ్న వేసింది ఆయన కుమారుడే కావడం విశేషం. థరూర్‌ కుమారుడు ఇషాన్‌ థరూర్‌ వాషింగ్టన్‌ పోస్టులో కాలమిస్టుగా ఉన్నారు.

‘మీరు పలు దేశాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మీతో సంభాషించిన వారెవరైనా.. ఉగ్ర దాడుల్లో పాకిస్థాన్‌ హస్తం ఉందనడానికి ఆధారాలను చూపాలని కోరారా.. దీనితోపాటు పదే పదే పాక్‌ మీ ఆరోపణలను తిరస్కరించడంపై మీరేమంటారు’ అని ఇషాన్‌ ప్రశ్నించారు. దీనిపై శశి థరూర్‌ నవ్వుతూ స్పందించారు. ‘ఇషాన్‌.. నువ్వు ఈ ప్రశ్న లేవనెత్తడం పట్ల సంతోషిస్తున్నా. దీనిని నేను ప్లాన్‌ చేయలేదు సుమా.. ఇషానే వాళ్ల నాన్నకు అడిగారు. మమ్మల్ని ఎవరూ ఆధారాలు కావాలని అడగలేదు. కానీ మీడియానే అడిగింది. మీ మీడియా తరఫున అడుగుతున్నావు. ఇంకో రెండు మూడు చోట్ల ఈ ప్రశ్న ఎదురైంది. అయితే కచ్చితమైన ఆధారాల్లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్‌ దాడి చేయదు’ అని శశి థరూర్‌ స్పష్టం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!