Indian Airports: ఎయిర్ పోర్టులకు ఉగ్ర ముప్పు – హెచ్చరికలు జారీ చేసిన ఇంటెలిజెన్స్
ఎయిర్ పోర్టులకు ఉగ్ర ముప్పు - హెచ్చరికలు జారీ చేసిన ఇంటెలిజెన్స్
Indian Airports : దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల భద్రతకు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్ర, సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యాయి. అన్ని ఎయిర్పోర్టుల్లో హైఅలర్ట్ ప్రకటించారు.
Indian Airports Alert
ఈ ఏడాది సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2 మధ్య విమానాశ్రయాలపై దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో కేంద్ర పౌర విమానయాన భద్రతా బ్యూరో అన్ని ఎయిర్పోర్టులకు (Indian Airports) అడ్వైజరీ జారీ చేసింది. విమానాశ్రయాల్లో తక్షణమే భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. రన్వేలు, హెలీప్యాడ్స్, ఫ్లైయింగ్ స్కూల్స్, ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లలో భద్రత పెంచాలని సూచించింది.
దీంతో విమానాశ్రయాల వద్ద భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. టెర్మినల్స్, పార్కింగ్ ఏరియా, పెరీమీటర్ జోన్, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో పెట్రోలింగ్ను పెంచారు. స్థానిక పోలీసుల సహకారంతో ఎయిర్పోర్టులకు వెళ్లే మార్గాల్లోనూ తనిఖీలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అంతర్జాతీయ, దేశీయ మార్గాల్లో పంపే మెయిల్ పార్సిళ్లను క్షుణ్ణంగా సోదా చేస్తున్నారు. సిబ్బంది, కాంట్రాక్టర్లు, విజిటర్స్ను కూడా తనిఖీలు చేయాలని నిర్ణయించారు.
విమానాశ్రయాల వద్ద అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు గానీ, లగేజీ గానీ కన్పిస్తే తక్షణమే సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాలని ప్రయాణికులకు సూచించారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ను యాక్టివేట్ చేశారు. అవసరమైతే మాక్ డ్రిల్స్ చేపట్టాలని పౌర విమానయాన భద్రతా బ్యూరో సంబంధిత అధికారులకు సూచించింది.
Also Read : Minister Nadendla Manohar: రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపాం – మంత్రి నాదెండ్ల మనోహర్
