Kangana Ranaut: బాలీవుడ్‌ పై కంగనా రనౌత్‌ ఫైర్‌ !

బాలీవుడ్‌ పై కంగనా రనౌత్‌ ఫైర్‌ !

బాలీవుడ్‌ పై కంగనా రనౌత్‌ ఫైర్‌ !

 

బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లోని మండి పార్లమెంట్ నుండి విజయం సాధించిన కంగనా రనౌత్‌ కు చండీగఢ్‌ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. శుక్రవారం ఢిల్లీలో జరగబోయే ఎన్డీఏ కూటమి అభ్యర్ధుల సమావేశానికి… చండీగఢ్‌ నుండి బయలుదేరిన కంగనను … విమానాశ్రయం సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ కుల్విందర్‌ కౌర్‌ చెంపదెబ్బ కొట్టారు. ఎంపీగా గెలుపొంది విజయోత్సవంలో ఉన్న తనపై ఈ విధంగా దాడి జరగడంపై కంగన షాక్ అయ్యారు. అంతేకాదు ఈ ఘటనపై సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసారు. అయితే ఆమెపై జరిగిన దాడి ఘటనపై బాలీవుడ్ నుండి ఎవరూ స్పందించకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేసారు. ఈ మేరకు బాలీవుడ్ పై ఇన్‌స్టా వేదికగా స్పందించిన ఆమె… తర్వాత తన పోస్టులో కొంతభాగాన్ని తొలగించారు. ప్రస్తుతం ఆమె ఇన్ స్టా పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

‘‘All eyes on Rafah గ్యాంగ్‌… ఇది మీకు మీ పిల్లలకు కూడా జరగొచ్చు. ఒకరిపై జరిగిన దాడిని మీరు వేడుక చేసుకుంటే… అదే ఘటన మీకూ ఎదురుకావొచ్చు. అలాంటి పరిస్థితికి సిద్ధంగా ఉండండి’’ అని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు. ‘‘నామీద ఎయిర్‌పోర్టులో జరిగిన ఘటనపై మీరు మౌనంగా ఉండొచ్చు లేక వేడుక చేసుకుంటూ ఉండొచ్చు. భవిష్యత్తులో మీరు మనదేశంలో అయినా, విదేశాల్లో అయిన అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే… ఇజ్రాయెల్‌ లేక పాలస్తీనాకు చెందినవారు మీపై లేక మీ పిల్లలపై దాడికి పాల్పడొచ్చు. ఇజ్రాయెల్ బందీల కోసమో లేక రఫా కోసం మీ అభిప్రాయం చెప్పినందుకు అలా జరగొచ్చు. అప్పుడు మీ వాక్‌స్వాతంత్ర్యం హక్కుల కోసం నేను పోరాడుతున్నానని గుర్తిస్తారు. నేను అలాచేస్తున్నందుకు మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నేను మీలాగా కాదు కదా’’ అని వ్యాఖ్యానించారు. అయితే అనూహ్యంగా తరువాత ఆ పోస్టును డిలీట్ చేశారు.

 

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణకు అభ్యర్థిస్తూ సినీ నటీనటులు ‘‘ఆల్‌ ఐస్ ఆన్ రఫా’’ అని రాసి ఉన్న ఒక ఇమేజ్‌ను షేర్ చేసిన సంగతి తెలిసిందే. అలియా భట్‌, ప్రియాంకా చోప్రా, కరీనా కపూర్, వరుణ్ ధావన్ తదితరులంతా దానిని షేర్ చేసిన వారిలో ఉన్నారు. తనపై దాడి ఘటనపై వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడమే ఆమె ఆగ్రహానికి కారణమై ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గురువారం విమానాశ్రయంలో భద్రతా తనిఖీ చేసుకొని ముందుకు వెళుతున్న కంగనపై అక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ కుల్విందర్‌ కౌర్‌ దాడి చేసిన సంగతి తెలిసిందే. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాల్ని నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన రైతుల్ని అగౌరవపరిచేలా కంగన చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కంగన ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి సీటు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your Email Id will not be published!