Kethireddy Pedda Reddy: తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్
తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్
Kethireddy Pedda Reddy : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి శుక్రవారం తాడిపత్రికి వచ్చారు. అయితే, తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇంట్లో పెద్దారెడ్డి (Kethireddy Pedda Reddy) లేకపోవడంతో తన సిబ్బంది ఈ నోటీసులను తీసుకున్నారు. అనంతరం ఈ విషయాన్ని పెద్దారెడ్డికి తెలిపారు. కాగా, సర్వేనెంబర్ 639, 640, 641లోని ప్లాట్ నెంబర్ 1, 16వ నెంబర్ ప్లాట్లో 10 సెంట్ల మున్సిపాలిటీ స్థలం ఆక్రమణకు గురైనట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు.
Kethireddy Pedda Reddy Gets Notice
ఆక్రమణకు గురైన మున్సిపాలిటీ స్థలం హద్దుల్లో ఉన్న 10 ఇళ్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగానే పెద్దారెడ్డి ఇంటికి కూడా నోటీసులు ఇచ్చారు. ఇంటి డాక్యుమెంట్లు, స్థలం లింకు డాక్యుమెంట్లు తీసుకొని వస్తే హద్దులు నిర్ణయిస్తామని నోటీసులో పేర్కొన్నారు మున్సిపల్ అధికారులు. గతంలో ఒకసారి పెద్దారెడ్డి ఇంటిని సర్వే చేసి కొలతలు వేశారు. ఇవాళ మరోసారి పెద్దారెడ్డి ఇంటికి కొలతలు వేస్తున్నారు అధికారులు. అంతకుముందు తాడిపత్రికి పెద్దారెడ్డి వస్తున్న విషయాన్ని పోలీసులు తెలుసుకున్నారు. ఈ క్రమంలో పుట్లూరు వద్ద పెద్దారెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల తర్వాతనే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లాలని సూచించారు అనంతపురం జిల్లా ఎస్పీ. మరోవైపు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. దీంతో తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఈ మేరకు వివరాలను తాడిపత్రి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిణి సుజాత మాట్లాడుతూ… ‘‘తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి భవనానికి మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ లేదు. 10 సెంట్లకు గానూ 12 సెంట్లలో ఇంటిని నిర్మించారు. కొలత నివేదికను ఉన్నతాధికారులకు పంపుతాం. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం’’ అని ఆమె తెలిపారు.
Also Read : Sajjala Ramakrishna Reddy: రాజధానిపై సజ్జల యూ టర్న్
