Kinjarapu Atchannaidu: వైఎస్ జగన్ కు మంత్రి అచ్చెన్నాయుడు చాలెంజ్
వైఎస్ జగన్ కు మంత్రి అచ్చెన్నాయుడు చాలెంజ్
Kinjarapu Atchannaidu : వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరోసారి నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ ఒక అబద్దాల కోరని విమర్శించారు. ఆయన గురించి మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉందన్నారు. గురువారం ఉమ్మడి కృష్ణాజిల్లా పామర్రు, వెంట్రప్రగడలో మొంథా తుపాన్ (Montha Cyclone) అనంతరం పరిస్థితులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పంటల బీమాపై వైసీపీ టెలి కాన్ఫరెన్స్లో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ఫైర్ అయ్యారు.
Kinjarapu Atchannaidu Challenge
వాస్తవాలు మాట్లాడితే సమాధానం చెబుతామని వైఎస్ జగన్కు (YS Jagan) స్పష్టం చేశారు. విమానం లేదని తుపాన్ ప్రభావంతో ఐదు రోజులుగా ఇబ్బంది పడుతున్న ప్రజలను పట్టించుకోని వ్యక్తి జగన్ అని తెలిపారు. చుట్టం చూపుగా వచ్చే వ్యక్తి మాటలకు ఏమనాలో అర్ధం కావడం లేదన్నారు. రైతులు కష్టాల్లో ఉంటే… గదిలో కూర్చుని జగన్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటల బీమాపై జగన్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. దమ్ము ధైర్యం ఉంటే టెలి కాన్ఫరెన్స్ వ్యాఖ్యలపై తమతో చర్చకు రావాలని వైఎస్ జగన్కు ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) చాలెంజ్ విసిరారు. వాస్తవ నివేదికతో తాము చర్చకు వస్తామన్నారు.
తుపాన్ ప్రభావంతో ఐదు రోజులుగా రైతులు, ప్రజలు కష్టపడుతుంటే.. కేవలం బెంగళూరు నుంచి విమానం లేదనే సాకుతో రాష్ట్రానికి రాని వ్యక్తిగా జగన్ మిగిలిపోయారని వ్యంగ్యంగా పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు అసత్యాలు ప్రచారం చేస్తున్నాడన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ బీమా వాటా చెల్లించ లేదని.. సాక్షాత్తు అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి బహిరంగంగా చెప్పారని ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.
రైతులకు సంబంధించిన ప్రతి విషయంలో అసత్యాలు ప్రచారం చేస్తూ…. వైసీపీ నేతలు అభాసు పాలవుతున్నారని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరితో పాటు మిర్చి, పొగాకు, మామిడి రైతులకు సీఎం చంద్రబాబు అండగా నిలిచారని వివరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఊసులో లేని…. పొగాకుకు కూటమి ప్రభుత్వం రూ.300 కోట్లు చెల్లించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
డైవర్షన్ కోసమే వైసీపీ కుట్ర – ఎమ్మెల్యే ఎంఎస్ రాజు
తనను లక్ష్యంగా చేసుకుని వైసీపీ చేస్తున్న ఆరోపణలను మడకశిర ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడు ఎంఎస్ రాజు గురువారం అమరావతిలో ఖండించారు. భగవద్గీతను తాను అవమానపరిచినట్లు వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. రాజ్యాంగం వల్ల దళితుల జీవిత ప్రమాణాలు మెరుగుపడ్డాయని తాను వ్యాఖ్యానించానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మొంథా తుపాన్ ప్రభావంతో ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్నసేవలను డైవర్ట్ చేసేందుకే వైసీపీ ఈ తరహా కుట్రకు తెర తీసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను దళిత హిందువునని.. కానీ భూమన కరుణాకర్ రెడ్డిలాగా ఇంట్లో ఒక మతం, బయట పదవుల కోసం మరో మతం ఆచరించే వ్యక్తిని కాదంటూ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు స్పష్టం చేశారు. అయినా తాను చేసిన వ్యాఖ్యలకు హిందువుల మనోభావాలు దెబ్బతిని ఉంటే ఒక హిందూ సోదరుడిగా అందరికీ క్షమాపణలు చెబుతున్నానని ఆయన ప్రకటించారు.
టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డ్ సభ్యుడు ఎంఎస్ రాజు తాజాగా అనంతపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగవద్గీతపై ఆయన వ్యాఖ్యలు చేశారంటూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో ఎంఎస్ రాజు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్లు అధికమయ్యాయి.
అలాంటి వేళ.. ఎంఎస్ రాజు గురువారం మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తాను చేసిన వ్యాఖ్యలను వైసీపీ వక్రీకరించిందన్నారు. అంతేకాదు.. తుపాన్ నష్టాన్ని భారీగా తగ్గించడంలో ప్రభుత్వం కృషి చేసిందని.. దీని నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే వైసీపీ ఈ కుట్రకు తెర తీసిందని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వివరించారు.
Also Read : TTD: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు
