KTR : పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పుపై రాహుల్ గాంధీకి కేటీఆర్ సవాల్

పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పుపై రాహుల్ గాంధీకి కేటీఆర్ సవాల్

KTR : బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇది ఓ చారిత్రాత్మక తీర్పు అని అభివర్ణించారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లోపు స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పును భారత రాష్ట్ర సమితి స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన సీజేఐకి ధన్యవాదాలు తెలిపారు.

KTR Challenging

కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని సుప్రీంకోర్టు నిరూపించిందని కేటీఆర్ (KTR) హర్షం వ్యక్తం చేశారు. గత ఎన్నికల సందర్భంగా పాంచ్ న్యాయం పేరుతో పార్టీ మారితే ఆటోమేటిక్‌గా అనర్హత వర్తించాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీకి నిజాయితీ ఉంటే తాను చెప్పిన నీతులకు కట్టుబడి ఉండాలని సవాల్ విసిరారు కేటీఆర్. చట్టవిరుద్ధంగా 10 మంది పార్టీ మారారని చెప్పేందుకు దర్యాప్తు అవసరం లేదన్నారు. 10 నియోజకవర్గాల్లో ఉపఎన్నికకు 3 నెలల సమయం ఉందని, పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై గురువారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించింది. ఏళ్ల తరబడి పిటిషన్లను పెండింగ్‌లో పెట్టడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. తాజా తీర్పుతో స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

Also Read : CM Revanth Reddy: సీఎం రేవంత్ చేతికి కాళేశ్వరం నివేదిక

Leave A Reply

Your Email Id will not be published!