హైదరాబాద్ : ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మీడియా సంస్థగా గుర్తింపు పొందింది ఇండియా టుడే. తాజాగా ఇండియా టుడే కాన్క్లేవ్ 2026కు రావాల్సిందిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఆహ్వానం అందింది. మార్చి 13, 14 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న ప్రతిష్టాత్మక ‘ఇండియా టుడే కాన్క్లేవ్’ సదస్సులో ప్రసంగించాలని కేటీఆర్ను కోరారు లేఖలో. ఈ మేరకు ఇండియా టుడే గ్రూప్ వైస్ చైర్పర్సన్ , ఎగ్జిక్యూటివ్ ఎడిటర్-ఇన్-చీఫ్ కల్లి పూరీ ఆయనకు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర పాలనా నమూనాను రూపొందించడం లోనూ, రాష్ట్రాన్ని సాంకేతికత, ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దడంలో కేటీఆర్ చూపిన నాయకత్వం ఈ సదస్సుకు ఎంతో సందర్భోచితంగా ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
గత రెండు దశాబ్దాలుగా ప్రపంచ గమనాన్ని అంచనా వేస్తూ, కీలక అంశాలపై చర్చించే వేదికగా ఈ కాన్క్లేవ్ గుర్తింపు పొందింది. భిన్నమైన ఆలోచనలు, స్వేచ్ఛాయుతమైన చర్చలు, సరికొత్త ఆవిష్కరణలకు ఇది వేదికగా నిలుస్తోంది.ఈ వేదికపై ప్రసంగించిన ప్రపంచస్థాయి దిగ్గజాల సరసన కేటీఆర్ చేరనున్నారు. ఇప్పటి వరకు ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, ఏపీజే అబ్దుల్ కలాం వంటి దేశాధినేతలతో పాటు ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, గీతా గోపీనాథ్ వంటి పారిశ్రామిక, ఆర్థిక రంగ నిపుణులు ప్రసంగించారు. భారతదేశపు మారుతున్న రాజకీయ, ఆర్థిక ముఖచిత్రంపై కేటీఆర్ తన విశ్లేషణను పంచుకోవాలని ఇండియా టుడే గ్రూప్ కోరింది.