KTR: బండి సంజయ్ ను ఆత్మీయంగా పలకరించిన కేటీఆర్
బండి సంజయ్ ను ఆత్మీయంగా పలకరించిన కేటీఆర్
KTR : తెలంగాణ రాజకీయాల్లో నేతల మధ్య మాటల తూటాలు పేలడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం అనునిత్యం కొనసాగుతూనే ఉంటుంది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించడం, రాజకీయ వేదికలపై ఘాటు విమర్శలు చేసుకోవడం సర్వ సాధారణం. అలా పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండే ఈ రాజకీయ ప్రత్యర్థులు… ఎదురుపడితే ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠకు తెరపడింది.
KTR Wishes
గురువారం తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో వరద బీభత్సం నేపథ్యంలో కేటీఆర్ (KTR) వరద బాధితులను పరామర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. ఇదే సమయంలో, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వరద ప్రాంతాలను సందర్శించేందుకు అక్కడికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో కేటీఆర్కు బండి సంజయ్ ఎదురుపడ్డారు. వీరిద్దరూ రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ హఠాత్ పరిణామం అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నెటిజన్లు రాజకీయాలకు అతీతంగా వెల్లివిరిసిన మానవత్వం అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు. విపత్తు సమయంలో నాయకుల మధ్య ఏర్పడిన ఈ సానుకూల పరిణామం, ప్రజల్లో మంచి సందేశాన్ని పంపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అంతకుముందు కేటీఆర్ మల్లారెడ్డిపేటలో వరద ప్రవాహాన్ని పరిశీలించి, సహాయక చర్యల్లో పార్టీ నేతలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. పంట నష్టానికి ఎకరానికి రూ.25,000, వరదల్లో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read : Kamareddy Rains: కామారెడ్డిలో వరద బీభత్సం
