Kunal Kamra: కమెడియన్ కునాల్ కు ఉగ్ర నిధులు – శివసేన నేత సంచలన ఆరోపణ
కమెడియన్ కునాల్ కు ఉగ్ర నిధులు - శివసేన నేత సంచలన ఆరోపణ
Kunal Kamra : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్ర(Kunal Kamra) వ్యాఖ్యల వివాదం రోజురోజుకు ముదురుతోంది. కునాల్ కామ్రకు ‘ఉగ్రవాద నిధులు’ అందుతున్నాయని శివసేన నేత రాహుల్ కనాల్ సంచలన ఆరోపణలు చేశారు. దేశ సమగ్రతను బలహీనపరిచి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు భారత వ్యతిరేక సంస్థల నుంచి కునాల్ నిధులు పొందుతున్నారని ఆయన ఆరోపించారు. ముంబై హాబిటాట్ స్టూడియోపై ఇటీవల దాడికి పాల్పడిన శివసేన(Shiv Sena) పార్టీ కార్యకర్తలకు రాహుల్ నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రాహుల్ సహా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా… ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. బెయిల్ పై విడుదల అయిన అనంతరం తన సోషల్ మీడియా వేదికగా ఈ ఆరోపణలు చేసారు.
ఈ సందర్భంగా రాహుల్… తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్లో సంచలన ఆరోపణలు చేశారు. కెనడా, ఖలిస్థాన్ మద్దతుదారులతో సహా పలువురి నుంచి కామ్రాకు నిధులు అందుతున్నాయని ఆయన ఆరోపించారు. ”భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థికక వ్యవస్థగా నిలవడం చాలామంది జీర్ణించుకోలేకున్నారు. కునాల్ వంటి కీలబొమ్మలకు ఈ సంస్థలు నిధులు అందజేస్తూ దేశ సమగ్రత, శాంతిభద్రతలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని ఆ పోస్ట్లో రాహుల్ పేర్కొన్నారు.
Kunal Kamra – సాక్ష్యాలు పోలీసులకు ఇస్తా – రాహుల్ కనాల్
కునాల్ కామ్రాపై తాను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయని రాహుల్ కనాల్ స్పష్టం చేసారు. వాటిని ఖార్ పోలీస్ స్టేషన్ కు అందజేస్తానని చెప్పారు. ప్రధాని మోదీని, మరికొందరిని విమర్శిస్తూ పలు వీడియోలు పోస్ట్ అయిన తర్వాత భారత వ్యతిరేక ఉగ్రసంస్థలు కునాల్కు డబ్బులు ఇస్తున్నాయని, వాటి ద్వారా వచ్చిన నగదుకు సంబంధించి తన వద్ద 300 స్క్రీన్షాట్లు ఉన్నాయని తెలిపారు. అంతేకాదు కామ్రా ఛానెల్ ను మూసివేసి, మానిటైజేషన్ నిలిపివేయాలని కోరేందుకు యూట్యూబ్ కార్యాలయానికి వెళ్తానని చెప్పారు.
ప్రముఖ స్టాండప్ కమెడీయన్ కునాల్ కామ్ర… ముంబైలోని హాబిటాట్ స్టూడియోలో ”నయాభారత్” కామిడీ షోలో ఏక్నాథ్ షిండేను ”ద్రోహి”గా అభివర్ణించడం సంచలనమైంది. కామ్ర క్షమాపణ చెప్పాలని శివసేన, బీజేపీ డిమాండ్ చేయగా, ఆయనపై పలు ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కామ్ర మద్రాస్ హైకోర్టునుండి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండేపై కునాల్ కామ్ర చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొంతమంది శివసేన కార్యకర్తలు… ఆ స్టూడియోపై దాడి చేసి ఫర్నీచర్ ను ధ్వంసం చేసారు. ఈ దాడి ఘటనలో 11 మంది శివసేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసారు. అలాగే ఆ స్టూడియో అక్రమ నిర్మాణం అంటూ బృహన్ ముంబై కార్పోరేషన్ అధికారులు కూల్చివేసారు.
Also Read : Yogi Adityanath: ప్రార్థనా స్థలాల వద్ద మాంసం అమ్మకాలపై యోగి సర్కార్ నిషేధం