Liquor Scam: తమిళనాడులో వెయ్యి కోట్ల లిక్కర్ స్కాం!
తమిళనాడులో వెయ్యి కోట్ల లిక్కర్ స్కాం!
దేశ రాజధాని ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉన్న అక్కడి సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో సహా పలువురు మంత్రులు ఇప్పటికే జైలుకు వెళ్లి బెయిల్ పై విడుదల కావడం జరిగింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టాస్మాక్)లో రూ.1,000 కోట్లకు పైగా అవినీతి చోటుచేసుకుందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకటించింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని టాస్మాక్… రాష్ట్రవ్యాప్తంగా 4,830 దుకాణాల ద్వారా మద్యం విక్రయాలు సాగిస్తోంది. వీటిల్లో ప్రతిరోజూ సరాసరిన రూ.150 కోట్ల మేర వ్యాపారం జరుగుతోంది. టాస్మాక్ సంస్థ ఏడు కంపెనీల నుంచి బీర్లు, 11 కంపెనీల నుంచి మద్యం రకాలు కొనుగోలు చేస్తోంది.
మద్యం దుకాణాల్లో నిర్వహించే బార్లు ప్రధానంగా అధికార పార్టీ నేతలకు చెందినవనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైలోని టాస్మాక్ ప్రధాన కార్యాలయం, మద్యం విక్రయించే సంస్థలు, టాస్మాక్ మాజీ అధికారుల ఇళ్లలో ఈ నెల 6న ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. మూడు రోజులు సాగిన ఈ తనిఖీల్లో పలు కీలక పత్రాలు, భారీగా నగదు లభ్యమైనట్లు సమాచారం.